10-01-2026 12:00:00 AM
కరీంనగర్, జనవరి 9 (విజయ క్రాంతి): క్రీడా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నారు. చీఫ్ మినిస్టర్ కప్- 2025 టార్చ్ ర్యాలీ కరీంనగర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమైంది. ఈ ర్యాలీని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
తెలంగాణ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గతంలో క్రీడాకారులకు రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉండేవి కావని అన్నారు. ఈ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నదని, క్రీడాకారులకు అవకాశాలు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నదని తెలిపారు. ఫుట్బాల్ దిగ్గజం మిస్సితో ఫుట్బాల్ ఆడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల్లో, క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారని తెలిపారు.
రాష్ట్రం నుండి అనేక మంది క్రీడాకారులు ఒలంపిక్స్ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డిఓ మహేశ్వర్, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్, జిల్లా యువజన అధికారి రాంబాబు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రమేష్,పడాల రాహుల్, సిద్ధారెడ్డి, యోగాసన సభ్యులు వీర్ల హనుమంత రావు, దండే ప్రియాంక,వేణుగోపాల్, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ వేణుగోపాల్, శంకరయ్య, అలువల విష్ణు, సత్తినేని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.