శారీరక, మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం
బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్
తుర్కయంజాల్, ఏప్రిల్ 12: క్రీడలు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ తెలిపారు. తుర్కయంజాల్లో ఏఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఏపీఎల్ ముగింపు కార్యక్రమానికి రాజ్ భూపాల్ గౌడ్ హాజరయ్యారు. టోర్నమెంట్ విజేతగా ఇంజాపూర్ 11, రన్నరప్గా ఎన్ఎస్ఆర్ కాలనీ చిన్నా టీమ్ నిలిచాయి. విజేతలకు షీల్డులు, ప్రోత్సాహక బహుమతి అందజేశారు.
ఈ సందర్భంగా రాజ్ భూపాల్ గౌడ్ మాట్లాడుతూ డ్రగ్స్, సోషల్ మీడియాకు బానిసలుగా మారకుండా నేటి యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఆటగాళ్లుగా మారాలంటే కృషి, పట్టుదల అవసరమన్నారు. టోర్నమెంట్ నిర్వాహకుడు, బీజేపీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు అభనందనలు తెలిపారు. క్రీడల పట్ల అభిరుచిని పెంచేందుకు ఏఎన్ఆర్ ట్రస్ట్ ముందుంటుందన్నారు.




