17-11-2025 12:00:00 AM
పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్ ల మధ్య హోరాహోరిగా సాగిన పోరు
విన్నర్ గా పోలీస్ టీం.. రన్నర్ గా ప్రెస్ క్లబ్ టీం
మెదక్, నవంబర్ 16(విజయక్రాంతి) :మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ అన్నారు. పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హోరాహోరీగా ఆదివారం సాగింది. ఇందుకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికయింది.
జిల్లా పోలీస్ జట్టు, మెదక్ ప్రెస్ క్లబ్ జట్టులు హోరాహోరీగా తలబడ్డాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ప్రెస్ క్లబ్ జట్టు నిర్ణిత 16 ఓవర్లలో 101పరుగులు చేసి అలౌట్ అయింది. తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన పోలీస్ జట్టు 12.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి పోలీస్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరై ఇరు జట్లకు ట్రోఫీ ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రికెట్ మైదానం కోసం తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. క్రీడా స్ఫూర్తితో ఉద్యోగరీత్యా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలో ఈ మ్యాచ్ ఆడడం సంతోషదాయకమన్నారు. మెదక్ పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిరంతరం మెదక్ నియోజకవర్గం అభివృద్ధికై కృషి చేస్తానన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో జర్నలిస్టులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రెండు నెలలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతన క్రికెట్ మైదానం పూర్తవుతుందన్నారు. క్రికెట్ పిచ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే సహకరించాలని కోరారు. ఈ మైదానంలో పోలీసులే కాకుండా క్రీడా నైపుణ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్, ఏఎస్పి మహేందర్ సీనియర్ జర్నలిస్ట్ లు చంద్రశేఖర్రావు, గోపాల్గౌడ్, ప్రకాశ్, నాగరాజు, రియాజ్, సురేందర్రెడ్డితో పాటు జర్నలిస్టులు, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.