కన్నుల పండువగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
ఘనంగా సాగిన ధ్వజస్తంభ ప్రథమ వార్షికోత్సవం
కనులారా తిలకించిన భక్తజనం
పాపన్నపేట: మండల కేంద్రం పాపన్నపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం మహా సుదర్శన యాగం, అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు గణపతి పూజతో ప్రారంభమై పుణ్యావాచనం, నవగ్రహ వాస్తు ఆరాధన, పూర్వక మహా సుదర్శన యాగం అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ తంతును కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




