25-06-2025 12:05:53 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన శ్రీధర్ను ఏసీబీ అధికారులు ఐదోరోజు మంగళవారం కూడా విచారించారు. ఆయన కస్టడీ గడువు ముగియనుండగా, మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు మరోసారి కస్టడీకి తీసుకునే ఆలోచనలో ఏసీబీ ఉన్నట్లు సమాచారం.
నూనె శ్రీధర్ అక్రమాస్తుల విలువ మార్కెట్ లెక్కల ప్రకారం రూ.150 కోట్ల మేర ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సోమవారం శ్రీధర్కు చెందిన బ్యాంకు లాకర్లను ఆయన సమక్షంలోనే తెరిచిన అధికారులు, భారీగా స్థిరాస్తుల పత్రాలు, బంగారు ఆభరణాలను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేశారు. విచారణలో చివరి రోజైన మంగళవారం మరికొన్ని లాకర్లను కూడా తెరిచినట్టు సమాచారం.
ఇంతవరకు జరిగిన విచారణలో శ్రీధర్ అక్రమంగా సంపాదించిన డబ్బును మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 పనులను పర్యవేక్షించిన శ్రీధర్, ఈ క్రమంలో భారీగా అవినీతికి పాల్పడి, ఆ సొమ్మును భూములు, ఇతర స్థిరాస్తుల కొనుగోలుకు మళ్లించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఆయన పాత్ర, ఇతర అధికారుల ప్రమేయం, అక్రమాస్తుల మూలాలు వంటి అంశాలపై మరింత లోతుగా విచారించాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు.