పీఎంశ్రీ పాఠశాలల్లో ఎస్ఎస్సి రెమెడియల్ క్యాంపులు ప్రారంభం
జిల్లా విద్యాశాఖాధికారి జి. శారద
పెద్దపల్లి,మే 12(విజయ క్రాంతి)ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ వీక్ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా, పదవ తరగతి (SSC) ఫలితాల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రత్యేక రెమెడియల్ క్యాంపులను ప్రారంభించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి జి. శారద మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఎస్.ఎస్.సి.లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం చేయడమే ఈ క్యాంపుల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
పి.ఎం. శ్రీ జెడ్.పి.హెచ్.ఎస్. అప్పన్నపేట, పి.ఎం.శ్రీ జెడ్.పి.హెచ్.ఎస్. రామగుండం పాఠశాలల్లో మే 12 నుండి జూన్ 3, వరకు సబ్జెక్టు నిపుణులైన ఉపాధ్యాయులచే ప్రత్యేక బోధన తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు.
పెద్దపల్లి లో
పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు నియోజకవర్గ స్థాయి ఎస్.ఎస్.సి. ఉత్తమ విద్యార్థులను జెడ్.పి.హెచ్.ఎస్. అప్పన్నపేట లో ఘనంగా సన్మానించి, వారిని అభినందించారు.
రామగుండం లో
పి.ఎం. శ్రీ జెడ్.పి.హెచ్.ఎస్.రామగుండంలో స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సందర్శించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, స్థానిక కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సప్లిమెంటరీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని విద్యాశాఖాధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






