01-06-2025 12:20:19 AM
కాలేజీ చైర్మన్ మరయ్య గౌడ్ హర్షం
హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): తెలంగాణ యూనిర్సిటీ పరిధిలోని ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నుంచి స్వయం ప్రతిపత్తి లభించింది. 2025 విద్యా సంవత్సరం నుంచే కాలేజీకి అటానమస్ హోదా అమలు కానుంది. దీంతో కాలేజీకి సొంతంగా పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవడం, కొత్త కోర్సుల ను ప్రవేశపెట్టడం, ఆధునిక విద్యా అవసరాలు, పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను తీర్చిదిద్దే అవకాశం లభిస్తోంది.
పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తదితరాలు కాలేజీ పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ ఏ మరయ్య గౌడ్ మాట్లాడుతూ.. ‘మా గత 33 సంవత్సరాల కృషికి గౌరవ సూచికమే ఈ స్వయం ప్రతిపత్తి హోదా. ఈ అవకాశాన్ని విద్యార్థుల్లో మెరుగైన నైపుణ్యాల కల్పన, జ్ఞానం కల్పించేందుకు వాడుకుంటాం’ అని పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తి లభించడంతో కళాశాల యాజమాన్యం, సిబ్బంది, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేశారు.