01-06-2025 12:20:30 AM
- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
- జలమండలి కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్ల ధర్నా
ఎల్బీనగర్, మే 31 : విశ్వ నగరం హైదరాబాద్ లో కనీస, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. జలమండలి కార్యాలయం వద్ద శనివారం బీజేపీ కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్పొరేటర్లు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా 5 పైసలు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. మంచినీటి సరఫరా కోసం కొత్త విస్తరణ పనులు లేవని, కొత్త డ్రైనేజీ లేదని చెబితే మీరే పైపులు తెచ్చుకోండి అని చెప్తున్నారని విమర్శించారు. ఒక వైపు విశ్వనగరం అంటారు.. ఆ స్థాయిలో పన్నులు వసూలు చేస్తున్నారు కానీ, సదుపాయాలు మాత్రం కల్పించడం లేదని విమర్శించారు.
మురుగు నీరు ట్రీట్మెంట్ చేసిన పాపానపోలేదని, మురుగునీరు రోడ్డు మీద పారుతున్నాయని తెలిపారు. ఇప్పుడే ఇలా ఉంటే భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు. వెంటనే మురుగునీటి కాలువలు, పైపులోని పూడికను క్లియర్ చేయాలని సూచించారు. మిషన్ భగీరథ కోసం రూ, 50 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినా నగరవాసులు మంచినీళ్ల కో సం ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. రెం డు నెలల్లోగా శివారు ప్రాంతాల్లో మంచినీరు సరఫరా అందించక పోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీజేపీ కార్పొరే టర్లు మాట్లాడుతూ... ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కొరత చాలా ఉందని, డివిజన్లోని చాలా కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీలైనంత త్వరగా వివిధ కాలనీలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్ సదుపాయం ఏర్పాటు చేయాలని జలముండలి అధికారులను కోరారు.
అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డితో సమావేశమై, వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అరుణాసురేందర్ యాదవ్, పవన్ కుమార్, వంగ మధుసూదన్ రెడ్డి, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, కొప్పుల నర్సింహ రెడ్డి, లచ్చిరెడ్డి, నర్సింహగుప్తా, శ్రవణ్, శ్రీవాణి, చేతన హరీశ్, తారా చంద్రారెడ్డి, శేషగిరి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.