17-09-2025 06:56:43 PM
మునుగోడు,(విజయక్రాంతి): నిధులు నియామకాల కోసం రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్ లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిది అని అన్నారు. టిఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పులపాలు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వెయ్యక వారి కలలు కలలాగే మిగిలిపోయాయని నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉండి మీ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని నిరసనలు ధర్నాలు మానుకోవాలని నిరుద్యోగులకు సూచించారు.