calender_icon.png 27 July, 2025 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూతపడిన పాఠశాలలను తిరిగి తెరిచేలా చర్యలు తీసుకోవాలి

26-07-2025 07:44:07 PM

అసిస్టెంట్ కలెక్టర్, సౌరబ్ శర్మ ఆదేశాలు జారీ..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పాల్వంచ మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు లేక మూతపడిన జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను తిరిగి తెరిచేందుకు విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్(ట్రైని) సౌరబ్ శర్మ(Assistant Collector Saurabh Sharma) ఆదేశాలు జారీ చేశారు. శనివారం పాల్వంచ మండలంలోని ఎంపీపీఎస్ నారాయణరావుపేట, భోజ్య తండాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల గ్రామాల్లో తక్షణమే ఇంటింటికి సర్వే చేపట్టి, పూర్తి డేటాతో రెండు రోజుల్లో నివేదికను తనకు స్వయంగా సమర్పించాల్సిందిగా ఎంఈఓ శ్రీరామ్మూర్తిని ఆదేశించారు. సర్వేద్వారా బడి ఈడు పిల్లలను గుర్తించి, ఆ పిల్లలను ఈ పాఠశాలలలో చేర్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారిని ఆదేశించారు. అన్ని వసతులతో కూడిన భవనాలు ఉన్నా, ఎందుకు విద్యార్థులను పాఠశాలకు పంపించడం లేదని గ్రామస్థులను ప్రశ్నించారు.

ఈ పాఠశాలలు మూత పడటానికి గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ఈ రెండు చోట్ల పాఠశాలను పునః ప్రారంభం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖకు సూచించారు. ఈ సందర్భంగా బోజ్యా తండను సందర్శించినప్పుడు , పాఠశాలలోని తరగతి గదులను గ్రామంలో కొందరు పాఠశాల గదులను  స్వాధీనం చేసుకొని  డిజె సౌండ్ సిస్టం,  శుభకార్యాలకు సంబంధించిన డెకరేషన్ సామాన్లను భద్రపరిచారు. వాటిని చూసిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రూరల్ ఎస్ఐ కు ఫోన్ చేసి పాఠశాలకు  రప్పించి గదిలో ఉన్న సామాన్లు అన్నిటిని స్వాధీనం చేసుకొని తక్షణమే సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై కి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ఆవరణ మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులు తమ స్వంత పనులకు వినియోగించుకోవడం చట్టరిత్యా నేరమని, వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు. 

నాగారం పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. తరగతి లోని విద్యార్థుల అభ్యస నా సామర్థ్యాలను పరిశీలించారు. పిల్లలు జవాబులు చెబుతూ చక్కగా స్పందించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగారంను కూడా సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులను పరిశీలించారు. డిజిటల్ తరగతులకు సంబంధించి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ టీవీ లను, సాఫ్ట్వేర్ ను సరైన రీతిలో పిల్లలు వినియోగించుకునే విధంగా, వాటిని సద్వినియోగ పరచాలని ఉపాధ్యాయులకు  సూచించారు. పాఠశాలలో స్టాక్ రిజిస్టర్, సానిటరీ మెటీరియల్ రిజిస్టర్ ఇతర పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడం, పాఠశాల సామాగ్రి అస్తవ్యస్తంగా ఉండడం పట్ల  ప్రధానోపాధ్యాయుడి పై  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలలలో,  పాఠశాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు ప్రధానోపాధ్యాయుల వద్ద అందుబాటులో ఉండాలని, రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్. కె. సైదులు ఎన్. సతీష్ కుమార్ మండల విద్యాధికారి శ్రీరామ్మూర్తి , ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.