30-06-2025 07:03:40 PM
పట్టణ ఎస్ఐ రాజశేఖర్..
మందమర్రి (విజయక్రాంతి): సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు చేస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎస్సై రాజశేఖర్(SI Rajasekhar) హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మధ్య కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రగిలించేలా ఉండే పోస్టులు, వీడియోలు, ఫోటోలు, దుష్ప్రచారాలు ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరులను కించపరిచే పోస్టులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
తెలియని వీడియోలు, ఫోటోలు ఎటువంటి ధృవీకరణ లేకుండా షేర్ చేసినా, ఫార్వర్డ్ చేసినా కఠిన చర్యలు తప్పవని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రూపులో నిరాధార పోస్టులు ఫార్వార్డ్ చేస్తే సంబంధిత వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాను సమాజ హితానికే ఉపయోగించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వాడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఆయన తేల్చిచెప్పారు.