calender_icon.png 15 August, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదల్లో ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా పటిష్ట చర్యలు

15-08-2025 01:09:56 AM

  1. వరద సహాయక చర్యల కోసం జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయలు విడుదల
  2. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వరరావు

ములుగు ఆగస్టు 14 (విజయక్రాంతి) : వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాష్ట్రంలో అల్పపీడనం వల్ల కురిసే భారి నుంచి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని   రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్  సచివాలయం నుంచి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎస్ కే. రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కురుస్తున్నాయని అన్నారు.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. వరద పరిస్థితుల పై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని,  ప్రజలకు ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామని అన్నారు.

వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని అన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారం పూర్తిస్థాయిలో తీసుకోవాలని అన్నారు. రోడ్ డ్యామేజ్, క్యాజ్ వే ల డ్యామేజ్, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ల డ్యామేజ్ ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. వైద్యపరంగా అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇవ్వరాదని, సెలవుల్లో ఉన్న వారిని రీకాల్ చేయాలని మంత్రి తెలిపారు. ఉమ్మడి జిల్లాలకు ఒక ప్రిన్సిపల్ కార్యదర్శి స్థాయి అధికారిని నియమించి, పర్యవేక్షణ చేస్తున్నట్లు అన్నారు. ఎక్కడ అనుకోని సంఘటనలు జరిగిన ఎస్డిఆర్‌ఎఫ్, ఎన్డిఆర్‌ఎఫ్ బృందాలను ప్రాపర్ గా వినియోగించాలన్నారు.

వచ్చే వరద పరిస్థితి ముందుగా తెలుసుకుంటే, నష్ట నివారణ చర్యలు పకడ్బందీగా చేపట్టవచ్చని అన్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితి నైనా ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉందని తెలిపారు. కలెక్టర్ స్థాయిలో పరిష్కరించే సమస్యలు ఉంటే పరిష్కరించాలని, ఆపై ఉన్నతాధికారులకు పంపితే త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని మంత్రి అన్నారు.