పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులు సమర్థంగా సిద్ధం కావాలి
డిప్యూటీ డీఈఓ చందన్..
ఉట్నూర్, (విజయక్రాంతి): ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్లోని వికాసం పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత పొందలేక సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను డిప్యూటీ డీఈఓ చందన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈఓ మాట్లాడుతూ, వచ్చే నెల 5వ తేదీ నుండి ప్రారంభంకానున్న పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రత్యేక తరగతులలో ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టును విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధించాలని ఆయన అన్నారు.
అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించిన విధానాన్ని పరిశీలించిన ఆయన, సబ్జెక్టు వారీగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు సందేహాలను వెంటనే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని, ప్రతిరోజూ పునశ్చరణ చేస్తూ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, విద్యార్థుల విజయం కోసం ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని కోరారు.






