ప్రొఫెసర్ నాగేశ్వరరావు అక్రమ అరెస్టును ఖండించిన ప్రజా సంఘాలు
తిరుమలాయపాలెం మే 27 (విజయ క్రాంతి): “ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లు వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం” అని ప్రజా సంఘాల ఐక్యవేదిక, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మందడి ఇజ్రాయిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ వార్తా విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి, ఆయన అరెస్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల పనితీరుపై విశ్లేషణలు చేయడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రతి మేధావి హక్కు అని పేర్కొన్నారు.
అలాంటి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని కేసులు నమోదు చేయడం, అరెస్టులకు పాల్పడడం భావప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమేనని మండిపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సామాజిక, రాజకీయ అంశాలపై నిరంతరం విశ్లేషణలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని, అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వాలను ప్రశ్నించే వారిని అణచివేయాలని చూస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మేధావులు, పాత్రికేయులు, విశ్లేషకులకు రక్షణ ఉండాలని, విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకు అవసరమని తెలిపారు. వెంటనే కేసులను రద్దు చేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కోడి లింగయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎస్.కె హమీద్, కాంగ్రెస్ యూత్ నాయకుడు గడ్డం రవి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్లావత్ లక్పతి తదితరులు పాల్గొన్నారు.






