19-10-2025 05:59:32 PM
విద్యార్థులు కష్టపడి అభ్యసించి ఉన్నత శిఖరాలకు అవరోధించాలి..
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మిరాజగోపాల్ రెడ్డి..
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): విద్యార్థులు బాగా కష్టపడి అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, సేవ చేయాలంటే పదవులు అవసరం లేదని సామాజిక సేవా దృక్పథం ఉండాలని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మిరాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక కోటి 50 లక్షల తన సొంత నిధులతో నూతనంగా నిర్మించిన తరగతి గదులను ఉమ్మడి నల్లగొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. కస్తూరిభా పాఠశాలకు అన్ని వసతులు కల్పించిన ఎమ్మెల్యే దంపతులకు పాఠశాల విద్యార్థులు కోలాటాల, నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అండగా ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి ఉంటుందన్నారు.
విద్య, వైద్యం, ప్రతి సమస్య ఉన్న పరిష్కరించడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సిద్ధంగా ఉందన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉండాలన్నారు. చదువు విషయంలో పిల్లలపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావద్దని, చదువుతో పాటు మానసిక దృఢత్వం, శారీరక వ్యాయామం చాలా అవసరమన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎల్లవేళల కృషి చేస్తామన్నారు. పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి తక్కువ వేతనాలు వస్తున్నాయని వారి దృష్టికి తీసుకురావడంతో తక్షణమే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో 5000 రూపాయల చొప్పున 14 మందికి జమ చేస్తామని తెలిపారు.
నియోజకవర్గంలో తల్లిదండ్రులు కోల్పోయిన ఎంతో మంది విద్యార్థులకు పోస్ట్ ఆఫీస్ లో లక్ష రూపాయలు డిపాజిట్, పేద విద్యార్థులను ఆదుకోవడంలో సంతోషంగా ఉందన్నారు. మద్యం, డ్రగ్స్ పాటు యువత పెడదారి పడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన కార్యచరణ మొదలు పెట్టినామని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 1500 మందికి ఆపరేషన్ ఉచితంగా చేయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అధికారులు, కస్తూరిభా పాఠశాల ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.