వరండాలో చదువులు...
ఉట్నూర్, జూలై 9 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం గట్టేపల్లి పంచాయతీ పరిధిలోని చిత్తగూడలోని గిరిజన విద్యా వికాస కేంద్రానికి పక్కా భవనం లేక వరండాలో చదువులు సాగుతున్నాయి. వర్షం వస్తే వరండా లోకి వర్షం నీరు రావడంతో చిన్నారి విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి. పక్కా భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నేటికి పక్కా భవనం మంజూరు కాకపోవడంతో గ్రామ పెద్ద అయినా మాణిక్ రావు ఇంటిముందు గల వరండాలో చదువులు కొనసాగుతున్నాయి. చిత్తగూడలో ఒకటో తరగతి నుండి మూడో తరగతి వరకు 15 మంది విద్యార్థులకు సి ఆర్ టి గజానంద్ ఆంగ్ల విద్యను బోధిస్తున్నారు. విద్యార్థులు చక్కగా చదువుకునే గ్రామంలో పక్క భవనం లేక వరండాలో బోధించవలసి వస్తుందని సిఆర్టి గజనం తెలిపారు. ఇప్పటికైనా పక్కా భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.






