19-06-2025 12:00:00 AM
-ఆపరేటర్ల కోసం నిరీక్షణ
-కోట్లు వెచ్చించినా నిరుపయోగం
-అలంకార ప్రాయంగా సబ్ స్టేషన్లు!
మహబూబాబాద్, జూన్ 18 (విజయ క్రాంతి): లో ఓల్టేజీ సమస్య పరిష్కరించేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లు వినియోగించకుండా వదిలేయడంతో అలంకార ప్రాయంగా మారాయి. మహబూబాబాద్ జిల్లాలో గత ప్రభుత్వ హాయంలో పోలేపల్లి, నరసింహుల గూడెం, తాళ్లపూస పల్లి, దామరవంచ గ్రామాల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఆ మేరకు ఒక్కో సబ్ స్టేషన్ నిర్మాణానికి 1.60 కోట్లు కేటాయించి నిర్మించారు.
గత ఏడాది ఆయాచోట్ల సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి సాంకేతిక పరీక్ష (ఛార్జ్) కూడా నిర్వహించారు. ఈ తంతు జరిగి కూడా నెలలు దాటుతున్నా సబ్ స్టేషన్లు వినియోగంలోకి లేకుండా వదిలేశారు. దీనితో కోట్ల రూపాయలు విచ్చించి నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లు నిరుపయోగంగా మారాయి. ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లు, గృహ, పారిశ్రామిక, చిన్న తరహా పరిశ్రమలకు లో వోల్టేజి సమస్య తలెత్తుతోంది.
ఇటీవల ఆయా సబ్ స్టేషన్ లో పరిధిలో విద్యుత్ సర్వీసుల సంఖ్య ఇటీవల పెరిగిపోవడంతో లో- వోల్టేజి సమస్య మరింత ఎక్కువైంది. కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు వినియోగంలోకి తెస్తే లో- వోల్టేజీ సమస్య తొలగిపోతుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లు ఎందుకు పనికి రాకుండా పోవడం విమర్శలకు తావిస్తోంది.
ఐదేళ్ల నుంచి వృధా గా ఉంటున్న దామెరవంచ సబ్ స్టేషన్
మహబూబాబాద్ జిల్లాలో గత రెండేళ్ల క్రితం పోలేపల్లి, నరసింహుల గూడెం, తాళ్లపూస పల్లిలో ఏర్పాటు చేసిన 33/11 విద్యుత్ సబ్స్టేషన్లు చార్జ్ చేసి వినియోగంలోకి తేకుండా వదిలేయగా, దామరవంచ సబ్ స్టేషన్ చార్జ్ చేసి ఐదేళ్లు దాటుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఐదు సంవత్సరాల కాలంగా విద్యుత్ సబ్ స్టేషన్ సేవలు ప్రారంభించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
కొత్త వాటికి మోక్షం ఎప్పుడు?
ఇక మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా సబ్ స్టేషన్లను నిర్మించడానికి ఎన్పీడీసీఎల్ ఆమోదం తెలిపింది. ఇందులో సోమ్లా తండా, వేమునూర్, కొమ్మవరం, రామచంద్రాపురం, ఉప్పరపల్లి, కేసముద్రం, బత్తులపల్లి, కోమట్ల గూడెం, లక్ష్మీ నరసింహపురం గ్రామాల్లో కొత్తగా విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి కొన్నిచోట్ల శంకుస్థాపన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
అయితే ఇప్పటివరకు కొత్త సబ్ స్టేషన్లు మంజూరైన ప్రదేశాల్లో నిర్మాణ పనులు చేపట్టకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్నిచోట్ల అనువైన స్థలం లేదని, మరికొన్ని చోట్ల స్థలం ఉండి కూడా పనులు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పరిపాలనా పరమైన అనుమతులు, టెండర్లు పూర్తయిన చోట కూడా సబ్ స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆపరేటర్లను నియమించాలి
కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ కోసం ఆపరేటర్ల నియామకం చేపట్టకపోవడం వల్ల, సబ్ స్టేషన్లు వినియోగంలోకి తేవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో సబ్ స్టేషన్ నిర్వహణ కోసం మూడు షిఫ్టులు పనిచేయడానికి ముగ్గురేసి ఆపరేటర్లను నియమించాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్వహణకు కొన్నిచోట్ల ఇద్దరే ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారని, కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ లకు ఆపరేటర్లను బదిలీ చేయడానికి ఆటంకంగా మారిందని చెబుతున్నారు.
కొత్త ఆపరేటర్ల నియామకం చేపడితే తప్ప కొత్త సబ్ స్టేషన్లు వినియోగించే పరిస్థితి లేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా పూర్తయిన సబ్ స్టేషన్లను వృధాగా వదిలేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆపరేటర్ల నియామకం చేపట్టి విద్యుత్ సబ్స్టేషన్లను వెంటనే వినియోగంలోకి తేవడంతో పాటు కొత్తగా మంజూరైన సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చి లో - వోల్టేజి సమస్య పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.