13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలి

20-01-2026 12:45 AM

వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి 

పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, జనవరి 19(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహోన్నత సంకల్పంతో మహిళల అభ్యున్నతి కోసం విస్తృత కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. బోధన్ పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సోమవారం బోధన్ లోని రోటరీ భవన్ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి రూ. కోటీ 99 లక్షల విలువ చేసే వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.

పట్టణ మహిళా సంఘాలకు మొట్ట మొదటిసారి తమ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద నిధులను కేటాయించిందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఇతోధిక తోడ్పాటు గురించి ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, సమాఖ్య ప్రతినిధులు ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని రుణాలతో వ్యాపార లావాదేవీల నిర్వహణ ద్వారా ఆర్ధిక పరిపుష్టి సాధించాలని సూచించారు.   

మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణాలు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూల్ యూనిఫాంల స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు వంటి వాటిని సైతం మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ళను మహిళల పేరిట మంజూరు చేస్తోందని, మహిళా సంఘాల సభ్యులకు ఇంటి నిర్మాణం కోసం రుణాలను కూడా అందజేస్తున్నామని తెలిపారు. ఎంబ్రాయిడరీ వర్క్ నైపుణ్యం కలిగి ఉన్న మహిళా సభ్యులకు కుట్టు యంత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మహిళల గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేలా ప్రభుత్వం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. రుణాలతో పాటు మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తోందని అన్నారు.

ప్రభుత్వ తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వడ్డీ లేని రుణాలను ఇతర అవసరాలకు మళ్లించకుండా, లాభాలను అందించే వ్యాపారాలలో పెట్టుబడిగా వినియోగించాలని హితవు పలికారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. సరికొత్త ఆలోచనలతో ప్రణాళికాబద్దంగా అంకిత భావంతో కృషి చేస్తే అనూహ్య రీతిలో ఆర్థిక విజయాలు సాధించవచ్చని అమెజాన్ వంటి వ్యాపార సంస్థల విజయాల గురించి ఈ సందర్భంగా కలెక్టర్ ఉటంకించారు. అయితే, ఎంత ఉత్సాహంగా రుణాలు తీసుకుంటున్నారో, అంతే ఉత్సాహంతో తిరిగి చెల్లించేందుకు చొరవ చూపాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రతి మహిళా సభ్యురాలు అవగాహన కలిగి ఉండాలన్నారు.

అప్పుడే అర్హులైన వారు వాటిని సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ లక్ష్యం దిశగా ముందుకు సాగుతారని సూచించారు. కేవలం ఆర్ధిక ప్రగతి మాత్రమే కాకుండా సామాజిక అభివృద్ధిని సైతం సాధించేలా మహిళలను చైతన్యవంతులను చేయాలని సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. సంఘాల కార్యకలాపాల నిర్వహణను పకడ్బందీగా పర్యవేక్షించాలని, తీర్మానాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీఆర్డీఏ సాయాగౌడ్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, పట్టణ మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.