01-11-2025 12:12:02 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో రాజకీయ పార్టీల ప్రచార హోరు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటుతూ ఎన్నికల అధికారులు చేపట్టిన చైతన్య కార్యక్రమాలు అంతే దీటుగా సాగుతున్నాయి. నా ఓటు నా హక్కు.. నా శక్తి, నేను తప్పక ఓటు వేస్తా‘ అనే నినాదం ఇప్పుడు నియోజకవర్గంలోని ప్రతీ కాలనీలో మారుమోగుతోంది.
జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మార్గదర్శనంలో స్వీప్ కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా, యూసుఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్లో పోలింగ్ తేదీని ప్రముఖంగా ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన భారీ అవగాహన బెలూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సందేశాలతో కూడిన ఈ బెలూన్, ఓటరు చైతన్యానికి ప్రతీకగా నిలిచింది.
ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎల్లారె డ్డిగూడ, రహమత్నగర్, షేక్పేట్ వంటి ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఓటు ప్రాముఖ్యతను సృజనాత్మకంగా తెలియజేసేందుకు వైకుంఠపాళి వంటి ఆటలను ఉపయోగిస్తున్నారు.వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన ప్రత్యేక సౌకర్యాల గురించి వివరిస్తూ కాలనీల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.