డీలిమిటేషన్.. కుయుక్తి వ్యతిరేకంగా ఓటేస్తాం
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు..
- డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తాం : మల్లికార్జున ఖర్గే
- నేటినుంచి మూడురోజులు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : మహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘ఇండీ’ కూటమి వ్యతిరేకం కాదని, అయితే ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తున్న విధానంపైనే అభ్యంతరాలు ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. అలాగే, డీలిమిటేషన్ బిల్లును తాము వ్యతిరేకిస్తామ న్నారు. రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ను ముడిపెట్టి కేంద్రం రాజకీయ కుతంత్రాలకు తెరలేపిందని, కుయుక్తులు పన్నింద ని ఖర్గే ఆరోపించారు.
రాజ్యాంగంలోని అధికారాలన్నింటిని కార్యనిర్వహవర్గం తీసుకుంటుందనన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికే కేంద్రం ప్రభుత్వం ఇలాచేస్తుందని చెప్పారు. ఖర్గే నివాసంలో బుధవారం ‘ఇండీ’ కూటమి నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు వ్యతిరేకంగా తామంతా పార్లమెంట్లో ఐక్యంగా పోరాడుతామని తెలిపారు.
కనీసం జనగణన కూడా పూర్తిచేయకుండా డీలిమిటేషన్పై కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. కొత్తగా చేపట్టే జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ జరపాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ‘ఇండీ’ కూటమి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో పాటు ఆర్జేడీ, శివసేన (ఉద్ధవ్ వర్గం), డీఎంకే, ఎన్సీపీ వంటి పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 ఎన్నికల నుంచి అమలుచేసేందుకు గురువారం నుంచి మూడురోజులు పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సవరణలు చేపట్టనున్నారు. మహిళలకు చట్టసభల్లో ౩౩ శాతం రిజర్వేషన్లు అమలుచేయడానికి, ఇప్పుడున్న లోక్సభ స్థానాల గరిష్ఠ సంఖ్య (550)ని గరిష్ఠంగా 850 వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాల నుంచి ఎన్నికైనవారి సంఖ్యను 815, కేంద్ర పాలిత ప్రాంతాలుగా 35గా పేర్కొంది. ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలే వ్యతిరేకిస్తున్నాయి.

బీజేపీ అధికార దాహం: రాహుల్ గాంధీ
మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్ర ప్రభుత్వం అధికార దాహాన్ని ప్రదర్శిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన, జిమ్మిక్కుల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనిని ఒక పక్కా వ్యూహంతో చేస్తున్న ‘అధికార దాహం’గా ఆయన అభివర్ణించారు.
మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. 2023లో పార్లమెంటు ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇది రాజ్యాంగంలో భాగంగా ఉందని పేర్కొన్నారు. కొత్తగా తెస్తున్న సవరణల వల్ల మహిళలకు ఒరిగేదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. కేంద్రం ఓబీసీల హక్కులను కాలరాస్తోందని రాహుల్ మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల సమాచారం లేని 2011 నాటి జనాభా గణనను వాడటం సరికాదన్నారు.
2027లో జరిగే కుల గణన ఆధారంగానే ఈ ప్రక్రియ జరగాలని డిమాండ్ చేశారు. ఎఫ్స్టీన్ ఫైళ్ల భయం వల్లే ప్రధాని మోదీ హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది దేశ వ్యతిరేక చర్య అని ఆయన పేర్కొన్నారు.
ఓబీసీలు, దళితులు, గిరిజనుల వాటాను దొంగిలించడానికి తాము అంగీకరించబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో కేంద్రం కొత్త ఎత్తుగడలు వేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. మహిళా సాధికారత కంటే రాజకీయ స్వలాభమే కేంద్రానికి ముఖ్యమని మండిపడ్డారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.






