తహసీల్దార్ కార్యాలయ భవన పనులు వేగవంతం చేయాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు
శ్రీరంగాపూర్ ఫిబ్రవరి 25:శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయ భవన పనులను వేగవంతం చేసి త్వరితగతిన అప్పగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.బుధవారం కలెక్టర్ శ్రీరంగాపురం మండల కేంద్రంలో పర్యటించి తహసిల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడిన ఆయన, అనుమతించిన మ్యాప్ ప్రకారం నాణ్యత ప్రమాణాలు తప్ప నిసరిగా పాటిస్తూ పనులు చేపట్టాలని సూచించారు. ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని, వచ్చే వారం లేదా గరిష్టంగా 10 రోజుల్లో భవనాన్ని పూర్తి చేసి హ్యాండోవర్ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ శ్రీరంగాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదామును సందర్శించి యూరియా ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు.
యూరియా స్టాక్ బోర్డును పరిశీలించి నిల్వలు, సరఫరా వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ద్వారా యూరియా బుకింగ్ ప్రక్రియపై వివరాలు సేకరించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉంచాలని, పారదర్శకంగా పంపిణీ జరగాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజు, ఎంపిడిఓ రవి నారాయణ, మండల వ్యవసాయ అధికారి హేమవతి, సింగల్ విండో సీఈవో శివకూమర్, సర్పంచ్ మద్దిలేటి ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.




