16 April, 2026 | 2:51 AM

లౌకికత్వానికి మారుపేరు తమిళనాడు

16-04-2026 01:30 AM
  1. ఆ సాంప్రదాయన్నీ కొనసాగించేందుకు కాంగ్రెస్-డీఎంకేను గెలిపించండి
  2. తమిళులు ఉద్యుక్తులు కావాలి
  3. ఓటర్లకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : లౌకికవాదానికి తమిళనాడు పెట్టని కోట అని తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి లౌకికవాదం కొనసాగాలంటే ఈ ఎన్నికలలో డీఎంకే-కాంగ్రెస్ పార్టీ అభ్యర్డులను బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తమిళనాడు ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడిచిన మూడు రోజులుగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అందులో భాగంగా బుధవారం కోయంబత్తూరు సమీపంలోని సింగనల్లూర్ నుంచి కవుండంపాలెం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన శివకాశికి చేరుకుని అక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తమిళనాడులో విభజన రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి ఇక్కడ ప్రవేశం కుడా కల్పించొద్దన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21 పార్టీలతో ఏర్పడిన సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ఢిల్లీ నుంచి గ్రామీణ స్థాయి వరకు విజయవంతంగా కొనసాగుతుందన్నారు. భవిష్యత్ ప్రధాని రాహుల్‌గాంధీ నాయ కత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రజల ఆకాంక్ష ప్రతిబింబించేలా ఏకం కావాలని పిలుపునిచ్చారు. శివకాశి నుంచి డీఎంకే బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.అశోకన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

రాజకీయాల కోసం కూటమి ఏర్పడలేదని ప్రజాసం క్షేమం, అభివృద్ధితో దేశాన్ని ముందుకు నడిపించేందుకు కూట మి ఏర్పడిందని చెప్పారు. సీఎం స్టాలిన్ ప్రశంసిస్తూ తమిళనాడులో డీఎంకే--కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన 300 రోజుల వ్యవధిలో 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.

రాష్ట్ర పోలీసు శాఖలో అర్హులైన 10,000 మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అంతే గాకుండా ఆ రాష్ట్రంలో ప్రస్తు తం మహిళలకు అందిస్తున్న రూ.1000 ఆర్థిక సహాయాన్ని 2000కి పెంచి నెలవారీగా అందిస్తామని హామీ ఇచ్చారు.