07-02-2026 01:40:26 AM
బీజేపీ గెలిచాక ఏం చేశారు
బీఆర్ఎస్ కు ఓటేయడమే సమస్యలకు పరిష్కారం
11వ వార్డులో భవానిని గెలిపించండి
బీఆర్ఎస్ ప్రచారంలో వంటేరు ప్రతాపరెడ్డి
గజ్వేల్, ఫిబ్రవరి 6 :మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించి అబద్దాల కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని బిఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లక్ష్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి భవానీ కరుణాకర్ ఎన్నికల ప్రచారంలో అయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్లే ముంపు గ్రామాలకు ఎక్కడా లేని విధంగా చక్కని ప్యాకేజీలు లభించాయని, గ్రామాన్ని ప్రత్యేకంగా మళ్లీ నిర్మించారన్నారు. పునరావాస గ్రామాల ప్రజలకు కంపెనీలు ఏర్పాటుచేసి ఉపాధి కల్పించాలని కేసీఆర్ ప్రయత్నిస్తే, కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారని, ఇప్పటికైనా వారు ప్రజలకు ఉపాధి కల్పించే యువజన చేయడం లేదన్నారు.
గ్రామంలోని ఆలయాల డబ్బులపై అసత్య ప్రచారం చేస్తున్నారని, మాజీ సర్పంచ్ కొలిచెలిమి స్వామి ఆలయాలను చక్కగా నిర్మించారన్నారు. బిజెపి ఎంపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు రాలేదన్నారు. ముంపు గ్రామాల ప్రజల త్యాగాల వల్లే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు కేసీఆర్ అందించారన్నారు.
ప్రజల త్యాగానికి పూర్తి న్యాయం చేశామని, మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి 11వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థి భవాని కరుణాకర్ ను ప్రజలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నుండి గ్రామానికి చెందిన నాయకులు, యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి ప్రతాప్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వార్డు ఇన్చార్జిలు రాగళ్ల దుర్గయ్య, పెద్దలపల శ్రీనివాస్ గౌడ్, నాయకులు కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.