సీఎంకు ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు
పదోన్నతులు, బదిలీలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపిన నేతలు
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): గత పదిహేనేళ్లుగా పెండింగ్లో ఉన్న భాషా పండిత్, పీఈటీ అప్గ్రేడేషన్, పదోన్నతులు బదిలీల సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉపాధ్యాయ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయనను క్యాంప్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు కలిశారు. తెలంగాణలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ చేపట్టని టీచర్ల బదిలీలు, పదోన్నతులను ప్రస్తుతం కల్పించి ఉపాధ్యాయుల హృదయాల్లో రేవంత్రెడ్డి చెరగని ముద్రవేశారని సంఘం నేతలు కొనియాడారు.
ముఖ్యంగా దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం సాహోసపేత నిర్ణయమన్నారు. పదోన్నతులకు ఆటంకంగా మారిన టెట్ అర్హత లేకుండానే టీచర్లకు సీఎం పదోన్నతులు కల్పించారని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ఆదేశాలతో పదోన్నతులు, బదిలీల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంను కలిసిన వారిలో పీఆర్టీయూ-తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఉమాకర్రెడ్డి, పార్వతి సత్యనారాయణ, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు అధ్యక్ష, కార్యదర్శులు జగదీశ్, నర్సింహులు, ఆర్యూపీపీటీ నాయకులు మహ్మద్ అబ్దుల్లా, గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, కోశాధికారి వీఎస్ఎస్సీ శర్మ, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నేతలు మహిపాల్రెడ్డి, వెంకటేశం తదితరులు ఉన్నారు.
ఆ ఖాళీలను డీఎస్సీలో భర్తీ చేయాలి
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలు డీఎస్సీలో కలిపి వాటిని భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 50 నుండి 300 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రతి సబ్జెక్టులో ఐదు నుంచి 30 వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని, డీఎస్సీని వాయిదా వేసి ప్రమోషన్స్ ఖాళీలు కలిపి పరీక్షలు నిర్వహించాలని కోరారు.






