07-09-2025 06:02:40 PM
ఈనెల 11 నుండి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు
10న సురవరం సంస్మరణ సభ
సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): భూమికోసం, భుక్తి కోసం దొరలు, భూసాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మట్టి మనుషులు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా బిజెపి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam) పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మాగ్ధుమ్ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతంలో నైజాం కు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం తెలంగాణ అగ్ని కణంగా మారిందని అన్నారు. ఈ పోరాటంలో నాలుగువేల అమరవీరుల రక్త తర్పణంతో చేయడం జరిగిందన్నారు. అదేవిదంగా దొరలు,భూస్వాముల లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ కె దక్కిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మట్టి మనుషులు చేసిన మహోత్తరమైన పోరాటాన్ని అవమానపరిచి సాయుధ పోరాట యోధులకు రావలసిన పింఛన్లను ఎత్తివేసిన హీనమైన చరిత్ర ఉందని విమర్శించారు.
సెప్టెంబర్ 17 పేరుతో బిజెపి అమరవీరులను స్మరించుకోవడం సిగ్గుచేటని దీని తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రైతంగా సాయుధ పోరాట వారోత్సవాలను ఈనెల 11 నుంచి 17 వరకు సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అందులో భాగంగా సాయుధ పోరాట చరిత్ర గలిగిన చిట్యాల మండలం గుండ్రాoపల్లి గ్రామంలో 11వ తేదిన అమరవీరుల స్థూపం వద్ద సాయుధ పోరాటం వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత అత్యధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై కక్షగట్టి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను ఇవ్వకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. దీని మూలాన వ్యాపారస్తులు కూడా యూరియాను కృత్రిమ కొత్తగా సృష్టించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల వ్యవసాయానికి సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
10న సురవరం సంస్మరణ సభ..
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర రెడ్డిసంస్మరణ సభ ఈనెల 10న నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లోగలజిఎల్ గార్డెన్ లోనిర్వహించడంజరుగుతుందన్నారు.ఈ సంస్మర సభలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు నల్పరాజు రామలింగయ్య అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి,జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి, లోడింగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరాస్వామి,గురిజ రామచంద్రం,బంటు వెంకటేశ్వర్లు బోల్గురినరసింహ,తిర్పారి వెంకటేశ్వర్లు, ఆర్ అంజ చారి, తూము బుచ్చి రెడ్డి లు పాల్గొన్నారు.