16-06-2025 01:27:38 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రపంచ ఐటీ రంగానికి తెలంగాణ కేంద్రంగా నిలుస్తోందని కేంద్ర నైపుణాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయులు కొత్త సాంకేతికతను తరగతి గదిలో వినియోగించాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సందర్శించారు.
రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల ఫొటోలు, ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు, పీఎంశ్రీ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు, విద్యార్థులు తరగతి గదుల్లో వినియోగిస్తున్న బోధనాభ్యసన సామగ్రి, బడిబాట, సమ్మర్ క్యాంప్ వంటి కార్యక్రమాల ఫొటోలను పరిశీలించారు. విద్యార్థులు నాలుగు కంప్యూటర్ల ద్వారా తెలుగు, ఆంగ్లం, గణిత అంశాలను అభ్యసిస్తున్న తీరును పరిశీలించి, విద్యార్థులు నేర్చు కుంటున్న తీరు గురించి వారితో మాట్లాడి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..డైట్స్, ఎస్సీఈఆర్టీ నిర్వహించే పరిశోధనలను, అధ్యయనాలను తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అమలు చేసేలా చూడాలన్నారు. డైట్స్, ఎస్సీఈఆర్టీలు మార్గదర్శకంగా ఉండి విద్యాభివృద్ధికి కృషి చేయా లని సూచించారు.
విద్య మాత్రమే సమాజంలో పరివర్తన సాధించేందుకు ఉపయో గపడుతుందని స్పష్టం చేశారు. విద్యాసంస్థలన్నీ మిషన్ మోడ్లో పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంస్థల సహకారంతో విద్యాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ అధికారులు, ఎస్సీఈఆర్టీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.