12-12-2025 02:18:01 AM
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణను ‘డిజిటల్ సేఫ్టీ’లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ‘తెలంగాణ రైజిం గ్ విజన్ 2047’ డాక్యుమెంట్లోనూ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ను పొందుపర్చామని చెప్పారు. గురువారం హెచ్ఐసీసీలో నిర్వహించిన ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూ రిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) కాంక్లేవ్ 2025’ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ.. రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు సవాలు విసురుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 265 మిలియన్లకుపైగా సైబర్ దాడులు జరిగాయని చెప్పారు. తెలంగాణలోని కీలక రంగాలకు చెందిన సంస్థలు, కం పెనీలపై గతేడాది 17 వేలకుపైగా రాన్సమ్ వేర్ దాడులు జరిగినట్టు ఓ ప్రముఖ సెక్యూరిటీ సంస్థ అధ్యయనంలో తేలిందని గుర్తు చేశారు.
ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఏడాది వ్యవధిలో రూ.800 కోట్లకుపైగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టడం వాస్తవ పరిస్థితికి నిదర్శనమని తెలిపారు. ఇలాంటి తరుణంలో సాంప్రదాయ పోలీసింగ్ కాకుండా స్మార్ట్ పోలీసింగ్ అవసర మని చెప్పారు. పౌరుల భాగస్వామ్యంతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమన్నా రు. మోసం జరిగిన తర్వాత కాకుండా ముం దే స్పందించి సైబర్ నేరగాళ్లను కట్టడి చేసే వ్యవస్థ అవసరమని తెలిపారు.
కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్స్, రియల్ టైం మానిటరింగ్, ఓపెన్ ఇన్ఫర్మేషన్ లాంటి అధునాతన వ్యవస్థల ద్వారా తమ ప్రభుత్వం పౌరుల డిజిటల్ సేఫ్టీకి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వివరించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వారిని ‘వారియర్స్’గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్, ఏడీజీపీ చారుసిన్హా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఎస్ సీఎస్సీ సెక్రటరీ జనరల్ రమేశ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.