19-12-2025 08:35:02 PM
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణకు ఉపయోగపడే సీపీఆర్ పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆలయ వసతి గృహం భీమేశ్వర సదన్ పార్కింగ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బందికి గుండెపోటు,శ్వాస ఆగిపోవడం వంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన తక్షణ చర్యలను వైద్యులు వివరించారు. సీపీఆర్ విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించి, ప్రతి ఒక్కరితో ప్రాక్టికల్గా చేయించారు.
ఈ శిక్షణను ప్రభుత్వ మెడికల్ కాలేజ్,ప్రభుత్వ జనరల్ హాస్పిటల్,సిరిసిల్లకు చెందిన ప్రొఫెసర్ డా. నాగరాజన్ చాటవర్థి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. చీకోటి సంతోష్తో పాటు డా. దివ్య, డా. రాకేష్లు అందించారు. లయన్ క్లబ్ సభ్యుడు చీకోటి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమ పర్యవేక్షణను ఆలయ డీఈ రఘునందన్, ఏఈఓ శ్రావణ్ కుమార్, ఏఈ రామకృష్ణారావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ నిర్వహించారు. ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై శిక్షణ పొందారు. భక్తుల రక్షణకు ప్రథమ చికిత్స, సీపీఆర్ వంటి నైపుణ్యాలు ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆలయ అధికారులు పేర్కొన్నారు.