25-05-2025 12:00:00 AM
ఆ ఊరు ఊరంతా ఇంద్రధనస్సులా రంగురంగుల బొమ్మలతో మెరిసిపోతూ ఉంటుంది. ప్రతి ఇంటి గోడ చూడచక్కని చిత్రాలతో ముస్తాబై కనిపిస్తుంది. స్థానికులు, పర్యాటకులు ఆ గ్రామాన్ని ‘రెయిన్ బో విలేజ్’ అని అంటారు. ఇంతకీ ఊరిలోని గోడలకు రంగురంగుల బొమ్మలు ఎవరు వేశారు? ఆ ఊరిని బొమ్మరిల్లుగా మార్చిందెవరు? అనే సందేహాలున్నాయి.. అవి తెలుసుకోవాలంటే.. స్టోరీ చదివేద్దాం..
తైవాన్లోని తైచుంగ్ పట్టణ శివారుల్లో ఒక కుగ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రతీ ఇల్లు, చివరకు రోడ్లు సైతం రంగురంగుల బొమ్మలతో ఆకట్టుకునేలా ఉంటాయి. దూరం నుంచి చూస్తే ఒక పెద్ద కాన్వాసుపై ఎవరో పెయింటింగ్ వేసినట్టుగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లగానే ఇళ్లు, రోడ్లు, కప్పులు.. ఎక్కడ చూసినా అద్భుతమైన చిత్రాలతో మెరిసిపోతూ ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే ఆ ఊరికి ‘రెయిన్బో విలేజ్’ అని పేరు స్థిరపడింది.
ఇళ్లు, రంగులను చూసి ఆ ఊరిలో చాలామంది నివసిస్తున్నారని అనుకుంటే మీరు పెయింట్ డబ్బాలో కాలేసినట్లే. అక్కడ నివసించేది ఒకే ఒక్కడు. ఆయన పేరు హువాంగ్ యంగ్ ఫు. అయితే స్థానికులు, పర్యాటకులు మాత్రం ఆయన్ని రెయిన్బో గ్రాండ్ పా అని పిలుస్తుంటారు. ఆ ఊరు బొమ్మరిల్లుగా మారడానికి రెయిన్బో గ్రాండ్పానే కారణం.
మిలటరీ విలేజ్..
కుమింటాంగ్ సైనికులు చైనా అంతర్యుద్ధంలో మావో జెడాంగ్ కమ్యూనిస్టు సైన్యంతో పోరాడారు. ఆ సైనికుల్లో హువాంగ్ యంగ్ ఫు కూడా ఉన్నారు. ఆ తర్వాత తైవాన్ ప్రభుత్వం కుమింటాంగ్ సైనికులు, వారి కుటుంబసభ్యుల కోసం ఒక కాలనీ నిర్మించింది.
దీన్ని ‘మిలటరీ డిపెండెన్స్ విలేజ్’ అని పిలిచేవారు. అక్కడ హువాంగ్కు కూడా ఒక ఇంటిని కేటాయించింది. ఒక తాత్కాలిక శిబిరంగా ఇళ్లు నిర్మించి తైవాన్ ప్రభుత్వం వారిని అక్కడ ఉంచింది. ఒకప్పుడు అక్కడ 1200 ఇళ్లు ఉండేవి. ఊరంతా కుమింటాంగ్ సైనికులు, వాళ్ల కుటుంబ సభ్యులతో కళకళలాడుతూ ఉండేది. కాల క్రమంలో చాలామంది చనిపోవడం, గ్రామం విడిచిపోవడం జరిగింది.
చాయ్ కప్పులు కూడా..
హువాంగ్ ఆర్ట్ వర్క్ను చూసేందుకు దగ్గరలోని విశ్వవిద్యాలయాల విద్యార్థులు తరలివస్తుంటారు. వాళ్లు ఆ ఫొటోలను ఇన్స్టాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ గ్రామం ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారింది. కాలక్రమంలో మిలిటరీ డిపెండెన్స్ విలేజ్ కాస్తా రెయిన్బో విలేజ్గా మారింది. పర్యాటకుల సంఖ్య పెరగడంతో గ్రామంలో ఒక కాఫీ షాపును ప్రారంభించారు.
అందులో కప్పులు, ఇతర వస్తువులు సైతం రకరకాల రంగుల బొమ్మలతో కనిపించడం విశేషం. ప్రస్తుతం 34 ఏళ్ల లిన్ యంగ్ కై ఆ ఊరిలో అవసరమైన చోట రంగులు వేసే పనిలో ఉన్నారు. హువాంగ్ వారసత్వాన్ని కొనసాగించాలని లిన్ యాంగ్ భావిస్తున్నారు. అడుగడుగున బొమ్మలతో ఆకట్టుకుంటున్న ఇంద్రధనస్సు లాంటి ఆ ఊరిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. సెలవులు, వీకెండ్స్లో కళాభిమానులు అక్కడికి వెళ్తుంటారు.