27-10-2025 04:59:05 PM
మందమర్రి (విజయక్రాంతి): ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా విజిలెన్స్ విభాగం పనిచేస్తుందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు. ఏరియా జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలతో పాటు, సింగరేణిలో ఈ నెల 27 నుండి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సింగరేణిలోని అన్ని గనులు డిపార్ట్మెంట్ లలో నిర్వహించడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థలో అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ విభాగం పనిచేస్తుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యోగులందరినీ చైతన్యపరిచి అవినీతి నిర్మూలనలో భాగస్వాములను చేయటమే విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థలో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయని గుర్తిస్తే వెంటనే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు, దేశ ప్రగతికి అవరోధం అయిన అవినీతిని నిరోధించు బాధ్యత ప్రతి ఉద్యోగి తీసుకోవాలని కోరారు. అవినీతి వలన దేశానికి, ఆయా సంస్థలకు జరిగే నష్టాన్ని గుర్తించి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే ఈ సమస్యను అధిగమించగలమన్నారు. వారోత్సవాలలో భాగంగా సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు వ్యాసరచన పోటీలు, సింగరేణి పాఠశాల విద్యార్థులకు వకృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం కార్యాలయం ఉద్యోగులతో విజిలెన్స్ "సమగ్రత ప్రతిజ్ఞ" చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఎఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సిఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ రవి, సీనియర్ పీఓ సత్యనారా యణ, జిఎం ఆఫీస్ హెచ్ఓడి లు, అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.