calender_icon.png 13 December, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ నాయకుల, కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్..

13-12-2025 07:03:27 PM

మొలంగూర్ లో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కొమురయ్యపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి..

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..

మానకొండూరు (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై శుక్రవారం రాత్రి దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన నేపథ్యంలో శనివారం రోజున బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ జిల్లా మండల నాయకులు కొమురయ్యను పరామర్శించి, దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మొలంగూర్ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దండు కొమురయ్య శుక్రవారం రాత్రి తెనుగువాడలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పిట్టల కొమురయ్య అనే వ్యక్తిని పరామర్శించి, ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దండు కొమురయ్యపై కారంపొడి చల్లి, చాతి మీద, పొట్టలో, మొఖంపై పిడిగుద్దులు గుద్ది విచక్షణారహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దాడిలో కొమురయ్య తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలో ఉండి సొమ్మసిల్లి పడిపోవడం జరిగిందన్నారు. ఆ ప్రాంతానికి చెందిన కొందరు కొమురయ్యను గుర్తించి కుటుంబ సభ్యులకు 100 నంబర్ కు సమాచారం అందించారని, అనంతరం 108 వాహనము ద్వారా చికిత్స నిమిత్తం దండు కొమురయ్యను హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని వివరించారు.

బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచిన దండు కొమురయ్యను ఎదుర్కోలేకనే కొంతమంది ప్రత్యర్ధులు ఈ దాడికి పాల్పడ్డారని గ్రామంలో చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి తాటాకు చప్పులకు, దాడులకు బీజేపీ భయపడదన్నారు. బీజేపీ నాయకుల కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఖబర్దార్ ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడుల సంస్కృతి మంచిది కాదని, వారిని ప్రోత్సహించే పార్టీలకు, వ్యక్తులకు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల నాయకులు, కార్యకర్తలతో పాటు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.