calender_icon.png 27 July, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త చరిత్రకు నాంది

27-07-2025 12:04:13 AM

- ఢిల్లీ సుల్తాన్ల నుంచి మొఘల్స్ కాలం వరకు చీకటి కోణాలు 

- ఆలయాల ధ్వంసం, సుల్తానుల క్రూరత్వంపై ప్రధాన దృష్టి

- 8వ తరగతి సోషల్ సైన్సెస్ పాఠ్యపుస్తకాల్లో ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురణ

గతంలో భారతదేశ చరిత్ర అనగానే.. ఢిల్లీ సుల్తాన్ల నుంచి మొఘల్స్ శకం వరకు పాఠ్య పుస్తకాల్లో ఎక్కువగా కనిపిస్తుండేది. మనం చదివిన పాఠ్యపుస్తకాల్లో వాళ్లు చేసిన దండయాత్రలు, యుద్ధాలు, రాజభోగాలు, పాలనా వైభవం గురించి మాత్రమే వివరించారు. అల్లావుద్దీన్, బాబర్, అక్బర్, ఔరంగజేబు వంటి పాలకులపై కాస్త సానుకూల దృక్పథం కనిపించేది. అయితే ఇన్నాళ్లు మనం చదువుకున్నది వాస్తవ చరిత్ర కాదని.. ఢిల్లీ సుల్తాన్ల నుంచి మొఘల్స్ కాలం వరకు వారి పాలనలో క్రూరత్వాన్ని, ఆలయ ధ్వంసాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తూ ఎన్‌సీఈఆర్‌టీ కొత్త చరిత్రకు నాంది పలికింది. వారి పాలనలో జరిగిన చీకటి కోణాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చీ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలోనే ఎన్‌సీఈఆర్‌టీ భారతదేశ చరిత్రకు సంబంధించి ‘మధ్యయుగ శకం’లో ఢిల్లీ సుల్తానుల నుంచి మొఘల్స్ పాలన వరకు కొనసాగిన అరాచకాలను 8వ తరగతి సోషల్ సైన్సెస్ పాఠ్యపుస్తకాల్లో ‘డార్క్ చాప్టర్స్’ పేరిట ముద్రించింది. మొఘల్స్ పాలకులైన బాబర్, అక్బర్, ఔరంగజేబు క్రూరత్వాన్ని చూపించడంతో పాటు మరాఠా యోధుడు చత్రపతి శివాజీని హిందూ ధర్మం కోసం పోరాడిన వీరుడిగా అభివర్ణించారు. అలాగే అహల్యాబాయి హిందూ ఆలయాల కోసం చేసిన కృషిని సవివరంగా పేర్కొన్నారు. జాతీయ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) 2020లో భాగంగా వీటిని పాఠ్యాంశంగా చేరుస్తున్నట్టు ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటించింది. అయితే ఎన్‌సీఈఆర్‌టీ కొత్తగా విడుదల చేసిన పుస్తకం వివాదాలకు దారి తీసింది. నిజమైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు అంటే.. చరిత్రను వక్రీకరించారని కొందరు మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అత్యంత క్రూరుడిగా బాబర్..

‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్ సిరీస్’లో భాగంగా 13 నుంచి 17వ శతాబ్ధం మధ్య భారతదేశాన్ని పాలించిన ఢిల్లీ సుల్తానేట్‌ల నుంచి మొఘల్ శకం వరకు జరిగిన దురాఘతాలను సమగ్రంగా వివరించారు. ముఖ్యంగా మొఘల్ సామ్రా జ్య స్థాపకుడు బాబర్‌ను అత్యంత క్రూరమైన వ్యక్తిగా అభివర్ణించారు. బాబర్ తెలివి తేటలు కలిగిన రాజుగా గుర్తింపు ఉన్నప్పటికీ తన స్వార్థం కోసం జనాభా మొత్తాన్ని ఊచకోత కోసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపో యినట్టు పుస్తకాల్లో ప్రచురించారు. మొఘల్స్‌లో అక్బర్ పాలనను మాత్రం క్రూరత్వం, సహనంతో కలగలిసిన మిశ్రమంగా పేర్కొన్నారు. అయితే చిత్తోర్‌గఢ్ ముట్టడి తర్వాత అక్బర్ సుమారు 30వేల మంది పౌరులను ఊచకోత కోసేందుకు ఆదేశాలిచ్చినట్టు పుస్తకంలో ముద్రించారు.

మొఘల్స్‌లో అత్యంత క్రూరుడిగా పేరు పొందిన ఔరంగజేబు దేవాలయాలు, గురుద్వారాలే లక్ష్యంగా తన రాజ్యపాలన సాగించాడని.. అతని చర్యలు రాజకీయ అణిచివేతకు భీజం పడినట్టు తెలిపింది. ‘నోట్ ఆన్ సమ్ డార్కర్ పీరియడ్స్ ఇన్ హిస్టరీ’ పేరుతో ఆయా కాలాల్లో జరిగిన ఆలయాల ధ్వంసం, రాజకీయ అణచివేత, అధిక హింసను హైలెట్ చేస్తూ పాఠ్య పుస్తకాల్లో ముద్రించారు. ఢిల్లీ సుల్తానేట్, విజయనగర సామ్రాజ్యం, మెఘలులు, మరాఠా ఎదుగుదల, రాజకీయంతో పాటు వారి పతనాన్ని సమగ్రంగా వివరించారు. ఢిల్లీ సుల్తానేట్ రాజు అల్లావుద్దీన్ ఆదేశాలతో సైన్యాధిపతి మాలిక్ కాఫర్.. మధురై, శ్రీరంగం, చిదంబరం హిందూ దేవాలయాలపై దాడులను ప్రస్తావించారు.

గతంలో మాదిరి కాకుండా ఈసారి మరాఠా చరిత్రకు విస్తృత ప్రాధాన్యతను కల్పించారు. మరాఠా పాలకులు చత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్ హిందూ మతంతో పాటు అన్య మతాలను సమంగా గౌరవిస్తూనే హిందూ విలువలను నిలబెట్టారని పేర్కొన్నారు. ఢిల్లీ సుల్తానేట్లు, మొఘల్స్ కాలంలో ధ్వంసమైన హిందూ ఆలయాలను పునర్నిర్మించడంలో శివాజీ మహారాజ్ చేసిన కృషిని ప్రస్తావించారు. విద్యార్థులకు చరిత్రపై నిజాయితీ కూడిన ఆధారాలను అందించడమే తమ ఉద్దేశమని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొంది.