12-08-2025 07:06:46 PM
హనుమకొండ (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఎన్నికలు లేకమని, ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే ఓట్లను తారుమారు చేసి దొంగ ఓట్లతో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులు డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రం అమరవీరుల స్థూపం వద్ద టిఎస్ఎఫ్, పిఎస్ఎఫ్, విసికె ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ధర్నాలో విసికె పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, కన్నం సునీల్, వరంగల్ బార్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కూనూరు రంజిత్ గౌడ్ తదితర సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఇవిఎం ల ద్వారా నాశనం చేయడంతో పాటు దొంగ ఓట్లను నమోదు చేసి అక్రమ పద్ధతిలో గెలిచి రాజ్యమేలుతున్న బీజేపీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల కుంభకోణాన్ని కళ్ళకు కట్టినట్లు బట్టబయలు చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి దేశంలోని ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న శక్తులన్నీ ఐక్యం కావాలని, ఇవిఎం లు రద్దయ్యేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. గత 20 సంవత్సరాల నుండి బ్యాంసెఫ్ లాంటి సంస్థలు ఇవిఎం ల రద్దు కోసం పోరాటం చేస్తున్న దొడ్డి దారిన అధికారంలోకి రావడానికి అలవాటుపడిన పాలకవర్గాలు ఇవిఎం లను వీడడం లేదని అన్నారు.
దేశంలో బలమైన ప్రతిపక్ష స్థానంలోనున్న కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నేడు ఐవిఎం లను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని పోరాడడం మంచి పరిణామమని అన్నారు. ఇవిఎం రద్దుతో పాటు దొంగ ఓట్లను తొలగించడం కోసం జరిగే పోరాటంలో రాజ్యాంగ శక్తులు రాహుల్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దొంగ ఓట్ల కుట్ర, రాజ్యాంగ రక్షణ, ఇవిఎం ల రద్దుకై గ్రామ గ్రామాన జరిగే చైతన్య పోరాటంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ముందు వరుసలో ఉందని తెలిపారు. దొంగ ఓట్ల కుట్రలో భాగమైన అధికారులను అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఆశీర్వాదం, గునిగంటి శ్రీనివాస్, దయాల సుధాకర్, ఇజ్జగిరి సురేష్, జన్ను పద్మ, ఆరేపల్లి త్రివేణి, అడ్లూరి పద్మ, శామంతుల శ్రీనివాస్, ఎగ్గడి సుందర్ రామ్ వివిధ సంఘాల నాయకులు కన్నాల రవి, రామంచ శ్రీను, నాగారం మనీతేజ, బన్నీ, జరిపోతుల వంశీ కృష్ణ, తోట రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.