28 March, 2026 | 2:34 AM

సీతారాముల కల్యాణం లోక కల్యాణానికి ప్రతీక

28-03-2026 12:02 AM

సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరం

రామయ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే

పాల్వంచ, మార్చి 27, (విజయక్రాంతి): సీతారాముల కల్యాణం లోక కల్యాణానికి ప్రతీక అని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసిన పలు మండపాలు, దేవాలయాలను సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్లతో కలిసి ఆయన సందర్శించి సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన పూర్వీకులు అందించిన సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగలను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. శ్రీరామ నవమి వేడుకలు సమాజంలో సోదరభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తిభావంతో జరుపుకునే ఇటువంటి పండుగలు ఒత్తిడితో కూడిన నేటి జీవనశైలిలో మానసిక ప్రశాంతతను ఇస్తాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆ శ్రీరామచంద్రుని కృపతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ వేడుకల విజయవంతానికి ప్రతి మండపాలు, దేవాలయాల వద్ద వద్ద ఉత్సవ కమిటీలు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అనంతరం ప్రసాద పంపిణీని ప్రారంభించారు. మండపాలు, ఆలయాల సందర్శన అనంతరం ఆయన నేరుగా భద్రాచలంలో జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.