16 March, 2026 | 11:20 AM

పగడ్బందీగా జనాభా లెక్కలు నిర్వహించాలి

16-03-2026 12:00 AM

మహబూబాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): జనాభా లెక్కల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పగడ్బందీగా నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జనాభా లెక్కలు 2027, శిక్షణ తరగతుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధముగా నిబంధన ప్రకారం క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి జనాభా గణనచేయాలని, మొదటి దశలో హౌస్ లిస్టింగ్ (ఇండ్ల జాబితా) మే 11 నుండి జూన్ 9 వరకు, రెండవ దశ జనాభా గణన ఫిబ్రవరి 2027వ సంవత్సరంలో జరుగుతుందన్నారు, మార్చి1,2027 వ తేదీని రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని, ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, ప్రణాళికలు రూపొందించడానికి, జనాభా గణాంకాలు కీలకంగా ఉంటాయన్నారు.

ఈ గణన దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానం ద్వారా మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ల ను ఉపయోగించి ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు తెలిపారు, ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ ను జనాభా గణన ప్రారంభానికి ముందు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి వల్లూరి శ్రీనివాసరావు, ముఖ్య ప్రణాళిక అధికారులు అశోక్, రామ్ దన్, జనాభా లెక్కల అధికారులు యువేందర్ బాబు, భూక్యా రవి నాయక్, మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు క్రిష్ణవేణి, గణేష్, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.