24-06-2025 12:06:14 AM
గ్రీవెన్స్ డేలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
నల్లగొండ టౌన్, జూన్ 23: అధికార పార్టీ నాయకుల అండతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. సోమవారం ఆయన నల్లగొండ కలెక్టరేట్ గ్రీవెన్స్ డే లో పాల్గొని నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అర్జీలను జిల్లా కలెక్టర్ కి అందజేసి మాట్లాడారు. ఈ జిల్లా కలెక్టర్ కి ఇప్పటివరకు 26 సార్లు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలపై స్పందించనందుకే నేను డైరెక్ట్ గా కలెక్టరేట్ వచ్చానని తెలిపారు. నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయ వాణి శ్రీను అర్జీలను కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారనికొప్పుల ప్రదీప్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే అధికారులు తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పుడు రికార్డ్ తో కేతేపల్లి పంచాయతీ సెక్రటరీ పై వేటు వేసారని, అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో అధికారులు పని చేస్తున్నారన్నారు. నియోజక వర్గంలో అనేక సమస్యలపై గ్రీవెన్స్ డేలో అనేకమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యమన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారని తెలిపారు. అధికారుల దగ్గర పవర్ లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవస్థను నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.