01-07-2025 05:46:48 PM
మానవ హక్కులకు భంగం కలిగితే కమిషన్ చర్యలు తీసుకుంటుంది..
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): గడచిన రెండున్నర నెలల్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(State Human Rights Commission) 1500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్(Dr. Justice Shameem Akhtar) తెలిపారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు వచ్చిన ఫిర్యాదులను మానవ హక్కుల కమిషన్ వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ 2025 ఏప్రిల్ 17న చార్జి తీసుకున్నదని, తనతో పాటు, మరో ఇద్దరు సభ్యులు కమిషన్లో ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడైనా మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఆన్లైన్ ద్వారా లేదా రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తే వాటిని పరిశీలించి వాటిపై పూర్తి విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విచారణ అనంతరం అవసరమైతే ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు. వర్కర్స్ కు జీతాలు చెల్లించకపోవడం, వారి హక్కులకు, స్వేచ్ఛకు, సమానత్వానికి ఆటంకం కలిగడం, ఇలాంటివన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తాయని, వీటిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు స్పందించడం జరుగుతుందన్నారు. కమిషన్ ఛార్జ్ తీసుకున్న సమయంలో 11,500 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, గడచిన రెండున్నర నెలల కాలంలో 1500 కేసులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
కొన్ని సుమోటో కేసులు సైతం తీసుకోవడం జరుగుతుందని, అలాగే బాధితుల తరఫున ఇచ్చే దరఖాస్తులను సైతం కమీషన్ స్వీకరిస్తుందన్నారు. ముఖ్యంగా విద్య,వైద్య తదితర సంస్థలను సందర్శించి సరైన విధంగా అమలవుతున్నది, లేనిది పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్కరికి మంచి విద్య, వైద్యం, సమానత్వం అందాల్సిన బాధ్యత రాజ్యాంగ ప్రకారం ఉందని ఆయన తెలిపారు.