21 May, 2026 | 2:41 AM

మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్

21-05-2026 12:00 AM

ఎంపీ వద్దిరాజు 

ఖమ్మం, మే 20(విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమమే తప్ప, కాంగ్రెస్ సర్కారులో ఎటువంటి పనులు ముందుకు సాగడం లేదని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.

పాలకులు తమ సొంత పనులు చక్కబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారని, పాత వాటికి రిబ్బన్స్ మాత్రం కట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఎంపీ రవిచంద్ర బుధవారం సాయంత్రం భద్రాచలంలో ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్ రావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

నిత్యం అయోధ్య జపం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకులు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం అభివృద్ధి గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోకపోవడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర అన్నారు.బీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు శ్రీసీతారామచంద్రస్వామి కొలువైన భద్రాచలం క్షేత్రాన్ని,ఈ జిల్లా సమగ్రాభివృద్ధి గురించి పార్లమెంటులో పలుమార్లు లేవనెత్తానని ఆయన పేర్కొన్నారు.

భద్రాచలం ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాల్సిందిగా, రైల్వే మార్గాన్ని ఇక్కడ వరకు పొడగించాలని, కొత్తగూడెంను రైల్వే డివిజన్ గా ప్రకటించాలని పార్లమెంటులో ప్రస్తావించానని ఎంపీ వద్దిరాజు వివరించారు.ఖమ్మం- కొత్తగూడెం-పాల్వంచ-భద్రాచలం మీదుగా బస్తర్ వరకు ఉన్న రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.

రుణమాఫీ కాక,రైతుభరోసా అందుక,ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు పుట్టెడు దుఃఖంతో పిట్టల మాదిరిగా రాలిపోతున్నారని ఎంపీ రవిచంద్ర ఆందోళన చెందారు.కాంగ్రెస్ రెండేళ్ల అసమర్థ పాలనతో విసిగిపోయిన ప్రజలు ‘రేవంత్ పోవాలి-కేసీఆర్ రావాలి‘అని ముక్తకంఠంతో నినదిస్తున్నారన్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.మొద్దునిద్రపోతున్న కాంగ్రెస్ సర్కారును బొందపెట్టేందుకు ప్రజలతో కలిసి ముందుకెడుతూ కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు మనమందరం అంకితభావంతో ముందుకు సాగుదామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.