17-12-2025 12:53:27 AM
వారి బెదిరింపులకు భయపడొద్దు
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులకు భయపడొద్దని, పంచాతీల నిధులు, ఇందిరమ్మ ఇండ్లు మీ అబ్బ సొత్తు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం తెలంగాణ భవన్లో ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో నూతనం గా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రసంగించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే చంపేస్తా అని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు.
ఎమ్మెల్యేల ప్రవర్తన చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారు. సర్పంచులు ఎవరూ ఇలాంటి బెదిరింపులకు లొంగవద్దు.. ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి వారి అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు. రేవంత్ రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తున్నారా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామసభలకు, సర్పంచులకే ఉంటుందన్నారు.
ఎవడైనా అడ్డుతగిలితే తాట తీసి లైన్లో పెట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఏమ్మెల్యేలకే నిధులు దిక్కులేఖ ప్రపంచబ్యాంకుకు ఉత్తరాలు రాస్తున్నారని, అలాంటి సర్పంచులకు ఏం ఇస్తారని కెటిఅర్ ఏద్దేవా చేశారు. రేండు సంవత్సరాల్లో ఒక్క రూపాయికూడా గ్రామ పంచాయితీలకు ఇవ్వని కాంగ్రెస్, ఇప్పుడు ఏలా గ్రామాలు నిధులు ఇస్తారన్నారు. కాంగ్రెస్ నేతలు తమ ఇండ్లు భూములు అమ్మి నిధులివ్వడంలేదని, ప్రజల సొమ్ములకు ధర్మకర్తలు మాత్రమే అని గుర్తుంచుకోవాలని కెటిఅర్ హెచ్చరించారు.
కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలని, మీ హక్కుల కోసం కొట్లాడండి, బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందుకోసం జిల్లాకోక ప్రత్యేక లిగల్ సెల్ ఏర్పాటుతోపాటు, స్ధానికి ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణాశిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
పల్లెలు సంక్షోభంలో..
కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చగా ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అనాథలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, వైకుంఠధామం వచ్చాయి. తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. కానీ నేడు పరిస్థితి దారుణం. ట్రాక్టర్లకు డీజిల్ పోయించే దిక్కు లేదు. రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడి బాదలుపడుతున్నారని, ఆ చెప్పుల లైన్లు కనపడితే ప్రభుత్వం పరువు పోతుందని ముఖ్యమంత్రి తెలివిగా ‘యూరియా యాప్’ అనే కొత్త స్కీమ్ తెచ్చారు. షాపులో దొరకని యూరియా యాప్లో దొరుకుతుందా?’ అని ఎద్దేవా చేశారు.
మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే..
సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని కేటీఆర్ విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు.
ఖానాపూర్, షాద్ నగర్ గడ్డపై మళ్ళీ గులాబీ జెండా ఎగురడం ఖాయం’ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇంచార్జీ జాన్సన్ నాయక్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసు నమోదు చేయాలి..
కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచు అభ్యర్థి బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నేతలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గంజి భారతిని కేటీఆర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ హైదరాబా ద్లోని యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. దాడి వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు.
కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై కామారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు చెప్పారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయడంలేదని, పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి చెల్లిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు ఇవ్వడంలేదన్నారు. పోలీసుల తీరు మార్చుకోకపోతే తాము తిరగబడటం ఖాయమని, శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని కేటీఆర్ కోరారు.