తడి బట్టల ప్రమాణాల లొల్లి
- కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పరస్పర సవాళ్లు
- వరంగల్లో ఉద్రిక్తత వాతావరణం
వరంగల్ (మహబూబాబాద్) జులై 3 (విజయక్రాంతి): భూముల కబ్జాలకు పాల్పడింది మీరంటే మీరు అని.. భద్రకాళి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో స్నానం చేసి ప్రమాణం చేస్తామంటూ.. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర బహిరంగ సవాల్ లొల్లి శుక్రవారం తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. భద్రకాళి బండ్కు చేరుకున్న నేతలు స్నానం ఆచరించి ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు.
కూడా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి ఎవరికి వారు మాట్లాడుతూ.. మీ హయాంలో భూముల అమ్మకాల్లో అవినీతి జరిగిందని, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అందిన కాడికి దోచుకున్నారంటూ పరస్పర విమర్శలకు దిగారు.
దీంతో వరంగల్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింప చేశారు. గత పదేళ్ల బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో వరంగల్ నగరంలో చేపట్టిన అభివృద్ధిలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపిస్తామని కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు.






