డీల్ కుదిరింది!
- త్వరలో అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం ఖరారు
- సంతకాలు కాగానే హోర్ముజ్ ఓపెన్ : ట్రంప్
- ఈ డీల్తో ఇజ్రాయెల్కు సంబంధం లేదు: ప్రధాని బెంజమిన్
- ట్రంప్ ప్రకటనను కొట్టిపారేసిన ఇరాన్
- భారత నౌకలపై దాడులను మేమే అడ్డుకున్నామన్న ట్రంప్
వాషింగ్టన్, జూన్ 12: ఇరాన్తో గొప్ప డీల్ కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ అన్నారు. ఇరాన్కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదనేదే డీల్కు సంబంధించి డాక్యుమెంట్లను ఫైనలైజ్ చేసే ప్రక్రియలో ఉన్నామని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో డీల్ ఒప్పందంపై సంతకాలు చేస్తామని, సంతకాలైన తక్షణమే హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని స్పష్టం చేశారు.
భారత నౌకలపై దాడులు ఇరాన్ పనేనని, వాటిని అమెరికా బలగాలే అడ్డుకున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. తాజా శాంతి ఒప్పంద ముసాయిదాలో, ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల అంశంపై ట్రంప్ కొంత సడలింపు చూపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ అంశంపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదని, పూర్తి వివరాలు రెండో దశ చర్చల్లో ఖరారు కావాల్సి ఉందని సమాచారం.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత మూడు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా శాంతి ఒప్పందం దాదాపు పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ప్రకటించారు. వాషింగ్టన్ డీసీలోని వైట్హౌస్ ఓవల్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఒక ’గొప్ప పరిష్కారాన్ని’ కనుగొన్నామని, రానున్న కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన దౌత్యపరమైన అధికారిక పత్రాల ముగింపు ప్రక్రియ పూర్తవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ వారాంతంలోనే యూరప్లో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు అధికారికంగా సంతకాలు చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇరాన్ సుప్రీం లీడర్ కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించారని ట్రంప్ ధ్రువీకరించారు. ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే ఇరాన్పై ఉన్న దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఎత్తివేస్తుందని, దీనివల్ల చమురు ధరలు భారీగా పడిపోతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.
తాజా చర్చల గురించి ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, పాకిస్థాన్ వంటి మధ్యప్రాచ్య దేశాల నాయకులతో తాను మాట్లాడానని ట్రంప్ బర్ట్ జోన్స్ మద్దతుగా జరిగిన టెలి-ర్యాలీలో ప్రసంగిస్తూ, ట్రంప్ప్రకటనను ఆహ్వానించారు.
ఇప్పటికే జేడీ వాన్స్ పర్యటనకు అవసరమైన పరికరాలతో నాలుగు సీ-17 విమానాలు ఐరాపాకు ప్రయాణం అయ్యాయి. ఇదిలా ఉండగా, ఇరాన్ మాత్రం తమ శుద్ధి చేసిన యురేనియం దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, దాన్ని విదేశాలకు తరలించే ఒప్పందం ఇప్పటివరకు కుదరలేదని తెలిపింది. ఇరాన్ అధికారులు యురేనియం నిల్వలపై తుది నిర్ణయం భవిష్యత్ అణు చర్చల్లోనే తీసుకుంటామని చెబుతున్నారు.
ఈ ఒప్పందం నేపథ్యంలో మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కుదిరే ఏ తుది ఒప్పందంలోనైనా ఇరాన్ తన వద్ద పోగుచేసుకున్న సుసంపన్న యురేనియం నిల్వలను తొలగించడం, క్షిపణి ఉత్పత్తులపై పరిమితులు విధించడం వంటి అంశాలు ఉంటాయని ట్రంప్ తనకు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ డీల్లో ఇజ్రాయెల్ భాగం కాదని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రణాళిక అమల్లోకి వస్తే, హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం, ఆంక్షల సడలింపు, అణు చర్చలు కొనసాగింపు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్ నౌకలపై దాడులను అడ్డుకున్నాం: ట్రంప్
భారత నౌకలపై డ్రోన్ దాడి చేసినందుకు ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ శుక్రవారం నిందించారు. ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న నౌకలపై ఇటీవల దాడులు జరగడాన్ని ట్రంప్ ఖండించారు. ఈ దాడులు చేసింది ఇరాన్ అని ఆరోపించిన ఆయన, అమెరికా బలగాలే వాటిని అడ్డుకున్నాయని పేర్కొన్నారు. భారత నౌకలపై దాడులు ఏ మాత్రం సమర్థనీయం కాదంటూ ట్రూత్ సోల్మీడియాలో పోస్టు పపెట్టారు.






