31-01-2026 12:39:11 AM
కామారెడ్డి అర్బన్, జనవరి 30, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ వార్డు ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం ఇంచార్జి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సందర్శించి పరిశీలించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గత బుధవారం నుంచి మూడు రోజులుగా నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నదని తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
నామినేషన్ల ఉపసంహరణ తేదీ 31వ తేదీ కాగా, తదుపరి ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు అందిన నామినేషన్ల సంఖ్య, నియమించిన ఆపరేటర్ల వివరాలు, అభ్యర్థుల సంఖ్య, FST, SST బృందాల ఏర్పాటు, శిక్షణ తరగతుల నిర్వహణ, వెబ్కాస్టింగ్ సదుపాయం, ప్రింటింగ్ ప్రెస్ వివరాలు, బ్యాలెట్ బాక్సుల సరఫరా తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, RౄO వీణ,మున్సిపల్ కమిషనర్ రాజేందర్, తహసీల్దార్ జనార్ధన్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.