03-02-2026 02:33:24 AM
తెలంగాణ లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఊరడమ్మ పండుగ
కామారెడ్డి, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండలో ఉర పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, గావు పట్టి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ దేవత అయిన ఊరడమ్మ ను పూజించి ,పోతరాజుల విన్యాసాలు,డప్పు చప్పుళ్ళతో ఈ వేడుకను నిర్వ హించారు. ఈ పండుగ సందర్భంగా గ్రామం చుట్టూ సరి రక్షణ కవచం చల్లుతారు.
గ్రామంలోని అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,బోనాలు సమర్పించి,మొక్కులు తీర్చుకున్నారు. కర్రతో(దారు శిల్పులు చెక్కినవి) విగ్రహాలను ప్రతిష్టించి,శివ సత్తుల పూనకాలు,పోతురాజుల విన్యాసాలు ఘనంగా నిర్వహించారు. దోమకొండ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంధువులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సవాలలో పాల్గొన్నారు. గ్రామంలో పెద్ద ఊర పండుగ వాతావరణం నెలకొంది.
పండుగ తర్వాత ఊరందరు ఉమ్మడిగా ఊరవతలకు వనభోజనాలకు వెళ్లారు, ఇళ్లకు తాళాలు వేయడం ఒక అనవాయితీ. బాన్సువాడ,కామారెడ్డి, దోమకొండ,తాండూరు తాడ్వాయి(వరంగల్),కరీంనగర్,మెదక్ వంటి ప్రాంతాల్లో ఈ ఊర పండుగను ఘనంగా నిర్వహిస్తారు.కాకతీయ సామ్రాజ్యంలో ఉరడమ్మ పేరుతో ఊరడమ్మ వెలసినట్లు చారిత్రక కథనం.
ఈ పండుగ ద్వారా ఊరు వాడ చల్లగా ఉండి ఎలాంటి మహమ్మారి రోగాలు ప్రబలకుండా ఉంటాయని గ్రామీణుల ప్రగాఢ విశ్వాసం మనీ. పురోహితులు బ్రహ్మశ్రీ.ఎస్.వెంకటేశ్వర శర్మ విజయ క్రాంతి తో తెలిపారు.చివరి రోజు మంగళవారం ఊర పండుగ ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.