28-10-2025 12:00:00 AM
కల్లు, లిక్కర్ వ్యాపారాల్లోవారిదే పెత్తనం
కల్లు గీతాకార్మికుల అణచివేత మామూళ్ళ వాటాలో అధికారులు
సర్కార్ జీతం కంటే ముందేఅందుతున్న ప్యాకేజీ కల్తీ కల్లు
షరా మామూలే అంటున్న ఎక్సైజ్అధికారులు
కామారెడ్డి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డిలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. వారు చెప్పిందే ఎక్సైజ్ అధికారు లకు వేదం. ఉన్నతాధికారులకు ఒక ప్యాకేజీ, కింది స్థాయి ఉద్యోగులకు మరో ప్యాకేజీ చొప్పున వాటాలు వేస్తూ యథేచ్ఛగా తమ కల్తీ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. దీంతో కల్లు ప్రియుల జేబులు గుల్లవడమే కాకుండా ఆరోగ్యం సైతం పాడవుతుంది.
కల్తీ కల్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డితో పాటు జిల్లాలో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. జిల్లాలో విచ్చల విడిగా కల్లు దుకాణాలు నడుపుతున్నారు. నాణ్యమైన చెట్టు కల్లును మాత్రమే విక్రయించాలి. అయితే చాలా చోట్ల అలా జరగడంలేదు.
దుకాణాదారుల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో ఒకరిని మించి మరొకరు కల్లు తయారీలో నిషేధిత మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారు. దీంతో జిల్లాలో కల్తీ కల్లు ఏరులై పారుతోంది. ఫలితంగా చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటోంది. మద్యం ధరలు పెరగడంతో తక్కువ రేటుకు వస్తున్న కల్లు వైపు జనం మొగ్గు చూపుతున్నారు. పైగా మత్తు ఉండడంతో మందుబాబులు ఆకర్షితులవుతున్నారు.
మాఫియా పెత్తనం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తులే కల్లు వ్యాపారం కూడా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి కల్లు డిపోలను కల్లుగీతా కార్మికులు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. సొసైటీలో సభ్యునిగా ఉండి కల్లు దుకాణాలను వేలం పాట ద్వా రా పొంది వ్యాపారం నిర్వహిస్తారు.
అయితే ఇందుకు విరుద్ధంగా కల్లు గీతాకార్మికులను అణచివేతకు గురి చేస్తూ వారిపై మద్యం మాఫి యా పెత్తనం చెలాయిస్తూ కల్లు వ్యాపారం సాగిస్తున్నారు. వ్యాపారం, వ్యవహారమంతా మాఫియా చేతిలోకి తీసుకొని లైసెన్సులు మాత్రం కల్లు గీతాకార్మికుల పేరుమీద తీసుకోవడం జరుగుతోంది
అనుమతిలేని దుకాణాలతో కల్తీకల్లు..
జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో లైసెన్స్ దుకాణాలు ఉండగా అంతకు రెట్టింపు అనుమతి లేని దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒకచోట లైసెన్సు దుకాణం ఉంటే దానికిందే మరో చోట దుకాణం ఏర్పాటు చేసి యథేచ్ఛగా కల్లు అమ్ముతున్నారు. ఒక విధంగా మద్యం బెల్టు దుకాణాల మాదిరిగా కల్లు దుకాణాలు సైతం వెలుస్తున్నాయి. ఇలాంటి దుకాణాల్లో వారు అమ్మిందే కల్లు అనే రీతిగా కల్తీకల్లు అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిద్రమత్తులో ఎక్సైజ్ అధికారులు..
కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎక్సైజ్ అధికారుల పనితీరు జిల్లా మద్యం సిండికేట్ వ్యక్తుల చేతుల్లో ఉందని, వారి ఉదాసీన వైఖరే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. నెలనెలా మామూళ్ల మత్తులో ఉండి కల్లు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో ఇష్టానుసారంగా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.
కానీ అప్పుడప్పుడు మందుబాబుల ఆగడాలు శృతి మించినపుడు స్థానికులు ఫిర్యాదు ఇచ్చినపుడే ఆబ్కారీ, పోలీసుల విభాగాలు హడావుడి చేస్తున్నాయి. అరకొర జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటు న్నారు. ఒకవేళ అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే ముందస్తుగా వ్యాపారులకు సమా చారం అందించేందుకు ఓ విభాగమే పనిచేస్తోందంటే అతిశయోక్తికాదు.