calender_icon.png 12 August, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడే రైతన్నే అదృష్టవంతుడు

12-08-2025 12:00:00 AM

  1. వ్యవసాయ సాగుకు జిల్లా అనుకూలం ఃమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  2. వ్యవసాయాన్ని పండుగగా మారుస్తున్న ప్రజా ప్రభుత్వం ః మంత్రి సీతక్క

ములుగు, ఆగస్టు 11 (విజయక్రాంతి) : పామాయిల్ పంటను సాగు చేస్తున్న రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ర్టంలోని అన్ని జిల్లాలలో ఫామాయిల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అరుకాలం కష్టపడి పలు పంటలను సాగు చేస్తున్న రైతులే అదృష్టవంతులని రాష్ర్ట వ్యవసాయం,మార్కెటింగ్ ,సహకారం, చేనేతలు,వస్త్రాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

సోమవారం ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామపంచాయతీ శివారులో 12 ఎకరాల స్థలంలో కేఎన్ బయోసైన్స్ కంపెనీ వారు ఏర్పాటు చేస్తున్న ఫామాయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ర్ట పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,ఆయిల్ ఫేడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి,రాష్ర్ట ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు,షేక్ యాస్మిన్ భాషా, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఇంచర్ల గ్రామంలోని ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ములుగు జిల్లా ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఎంతగానో అభివృద్ధి చెందిందని, సాగునీరు పుష్కలంగా ఉండడంతో వ్యవసాయానికి అనుకూలంగా మారిందని అన్నారు. సమ్మక్క సారలమ్మ, కాకతీయ రాజులు తిరిగిన ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని, ములుగు జిల్లా అభివృద్ధి కావడానికి మంత్రి సీతక్క ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏది అడిగినా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని తెలిపారు. 

ఈ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఫామ్ ఆయిల్ పంట సాగుకు రైతన్నకు కష్టం తక్కువగా ఉండి ఎక్కువ లాభం చేకూరుతుందని, ప్రతి రైతు ఈ పంట సాగు కోసం ప్రయత్నించాలని సూచించారు. జిల్లాలోని రైతులు గతంలో వరి, పత్తి పంట సాగు చేయడానికే ఆసక్తి కనపరిచారని, ప్రస్తుతం ఫామాయిల్ పంట సాగు చేయడానికి ముందుకు రావడం ఆశించదగ్గ విషయమని అన్నారు.

ఈ పంట ద్వారా పచ్చదనంతో పరిసర ప్రాంతాలు ఉండడంతో పాటు ప్రతి సంవత్సరం లక్ష రూపాయల ఆదాయం పొందే అవకాశం రైతులకు దక్కుతుందని, 200 రూపాయలకు లభించే మొక్కను రాష్ర్ట ప్రభుత్వం 25 రూపాయలకే రైతులకు అందిస్తున్నదని  ప్రస్తుతం వివిధ పంటలకు అధికంగా పురుగుల మందులు వాడుతున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మంత్రి సీతక్క

ములుగు, ఆగస్టు11(విజయక్రాంతి):సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనీ రాష్ర్ట పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కసంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని  గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను రాష్ర్ట పంచాయతీ రాజ్ గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క జనరల్ హాస్పిటల్ వార్డులను, చికిత్స పొందుతున్న రోగులను, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకన్నారు.  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. , జనరల్ హాస్పిటల్ సూపరిన్ డెంట్ వి. రాజేంద్ర శేఖర్ డాక్టర్లను,  హాస్పటల్ సిబ్బందిని అభినందించారు.

జనరల్ విభాగంలో ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి బిల్డింగ్ పై అంతస్తు నిర్మాణం చేపడతామని, ములుగు జిల్లాలో అన్ని రకాల ఆపరేషన్లు జనరల్ హాస్పిటల్ లోనే జరిపించడానికి అన్ని సదుపాయాలను ఏర్పాటు  చేస్తామని మంత్రి పేర్కొన్నారు.