రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు
సీఎం రేవంత్ సమీక్ష.. కాకతీయ తోరణం, చార్మినార్ తొలగింపు?
తుది దశకు చేరుకొన్న రాష్ట్ర గేయ రూపకల్పన
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర నూతన అధికారి చిహ్నం తుది రూపు సిద్ధమైంది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై సీఎం రేవంత్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం చిహ్నంలో ఉన్న కాతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించి ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అందుకోసం ప్రాథమికంగా 12 నమూనాలను తయా రు చేయించారు.
చిహ్నంలో ఏముండాలన్న విషయమై సీఎం ఇటీవల సీపీఐ, సీపీఎం నేతలతో పాటు ఉద్యమకారులు, కాంగ్రెస్ నేతలు, కొందరు అధికారులతో చర్చించారు. అంత ర్జాతీయంగా గుర్తింపు పొందిన చార్మినార్, అశోక స్తంభంలోని మూడు సింహాలు, జాతీయ జెండాలలోని మూడు రంగు లను కొనసాగిస్తూనే తెలంగాణ పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా మరో గుర్తుపెట్టాలని పలువురు సూచించినట్లు సమాచారం. రెండు రోజు ల క్రితం రుద్ర రాజేశంతో చర్చించిన సీఎం.. చిహ్నంలో కొన్ని మార్పులను సూచించారు. బుధవారం నాటి సమావేశంలో రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కొదండరామ్, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తుది దశకు రాష్ట్ర గేయం
తెలంగాణ రాష్ట్ర గేయం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉపముఖ్యమంత్రి భట్ట విక్రమార్కతో సీఎం రేవంత్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గేయాన్ని విన్న సీఎం సంతృప్తి వ్యక్తంచేసి.. కొన్ని సలహాలు, సూచనలు చేసినట్టు తెలిసింది. తెలంగా ణ ఖ్యాతిని మరిం త ఇనుమడింపజేసేలా, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా గేయా న్ని రూపొందించాలని కోరారు.






