04-06-2025 11:57:14 PM
పాలనలో ఫుడ్పాయిజన్లు, ప్రాణాలు కోల్పోవడం సాధారణమైంది..
హరీశ్రావు..
హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఒకేసారి 70 మంది ఫుడ్పాయిజన్కు గురికావడం, అందులో ఒకరు మృతి చెందడం అత్యంత బాధాకరమని మాజీమంత్రి హరీశ్రావు(Former Minister Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఎక్స్లో ఆయన స్పందించారు. విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, వైద్యం కోసం వచ్చే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో ఫుడ్ పాయిజన్లు జరగడం, ప్రాణాలు కోల్పోవడం అత్యంత సాధారణమైపోయిందని మండిపడ్డారు. మానసిక వైద్యం పొందేందుకు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్లకు కూడా నాణ్యమైన భోజనం పెట్టలేని దిక్కుమాలిన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో క్లిష్టపరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులతో పాటు, మిగతా 67మందికి నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.