calender_icon.png 27 June, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జులై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి..

26-06-2025 10:05:45 PM

సీఐటీయూ జిల్లా కార్యదర్శి దంపల రంజిత్ కుమార్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా జులై 9న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దంపల రంజిత్ కుమార్(CITU District Secretary Dampala Ranjith Kumar) పిలుపునిచ్చారు. బెల్లంపల్లి సీఐటీయూ కార్యాలయంలో గురువారం జరిగిన అంగన్వాడి టీచర్స్ & హెల్పర్స్ యూనియన్(CITU) కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్, మినీ టీచర్స్ ను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలని అనేక పోరాటాలు నిర్వహించానన్నారు. 2013లో జరిగిన 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశంలో అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐసిడిఎస్ ప్రైవేటీకరణ చేయకూడదని నిర్ణయం చేసిందనీ తెలిపారు.

అంగన్వాడీ  ఉద్యోగులకు గ్రాట్యుటీ చట్టం 1972ను వర్తింపచేయాలని 2022లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్  ఇచ్చిందన్నారు. 2024లో గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ టీచర్స్ను 3వ తరగతి, హెల్పర్స్న  4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని జడ్జిమెంట్ ఇచ్చిందినీ గుర్తు చేశారు.. వీటిని అమలు చెయ్యాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను పెంచాలని అంగన్వాడీలు నిరంతరం పోరాటం చేస్తున్నారనీ పేర్కొన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదనీ విమర్శించారు.

అంగన్వాడి యూనియన్(సిఐటియు)  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భానుమతి, రాజమణి, మాట్లాడుతూ... ఐసిడిఎస్ను సంస్థాగతం చేయాలని సుప్రీంకోర్టు, కాగ్ నివేదిక, యునిసెఫ్ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కూడా నిర్ణయం చేసిందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం యొక్క ప్రాధాన్యతను గుర్తించడం లేదనీ, పైగా ఈ స్కీమ్ను పూర్తిగా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ప్రైవేటీకరణలో భాగంగా ఐసిడిఎస్ను నిర్వీర్యం చేస్తూ ఎన్ఈపి చట్టాన్ని తెచ్చిందన్నారు. పిఎం మొబైల్ సెంటర్స్ తదితర విధానాలను ముందుకు తెస్తున్నదనీ వివరించారు.

ఐసిడిఎస్ నిర్వహణ ఖర్చులో కేవలం 60% మాత్రమే రాష్ట్రాలకు చెల్లిస్తున్నదనీ, ఐసిడిఎస్ అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ పెంచడం లేదన్నారు. ఈ చర్యలు ఐసిడిఎస్ నిర్వీర్యానికి తోడ్పడుతున్నాయనీ, దేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, గౌరవప్రదమైన వేతనాలు లేకపోవడం, రక్త హీనత, పోషకాహార లోపం తీవ్రమౌతున్న దశలో ఐసిడిఎస్ సేవలు మరింత  అవసరమని ఈ అంశాలు తెలియజేస్తున్నాయన్నారు.

ఐసిడిఎస్కు నష్టం కల్గించే చర్యలు తక్షణమే ఆపాలి. ఐసిడిఎస్కు నిధులు  పెంచాలనీ డిమాండ్ చేశారు. సకల సమస్యల పరిష్కారం కోసం జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ చల్లూరు దేవదాస్, రాజేశ్వరి అనురాధ రాధాబాయి శంకరమ్మ విజయలక్ష్మి లీలవాతి తదితరులు పాల్గొన్నారు.