23-07-2025 07:41:37 PM
మందమర్రి (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి(Minister G Vivek Venkataswamy) స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని అందుగులపేట సాయిమిత్ర గార్డెన్స్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహిళ సంఘాలకు 17.21 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల చెక్కును అందించి మాట్లాడారు. నిరుపేద ప్రజల అభివృద్దే ధ్యేయంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని, అంతే కాకుండా మహిళా సంక్షేమానికి కృషి చేస్తుందని, మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు వడ్డీ లేని రుణాల ద్వారా తమ వ్యాపారాలను విస్తృతం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. మహిళ సమాఖ్య సంఘాలకు తోడ్పాటు అందించేందుకు మహిళా శక్తి పథకంలో బాగంగా పట్టణంలో మహిళ లకు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని బరోసా ఇచ్చారు. మహిళ శక్తి పథకంలో స్వయం సహాయక మహిళసంఘాలకు క్యాంటీన్లు, ఎలక్రిక్ బస్సులు, పెట్రోల్ బంక్ లు మంజూరు చేస్తున్నామని మహిళలు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.రాష్ట్రప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ కు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని, సింగరేణి సంస్థలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం వేజెస్ పెంచేలా సింగరేణి సిఎండితో చర్చించి అమలు చేస్తానని హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజక వర్గం లో 3882 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని, 3880 మంది పేర్లను రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేయడం జరిగిందని, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రేషన్ కార్డులు రాని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నియోజక వర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు తొందరగా చేపట్టాలని కోరారు.
అనంతరం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అంతకు ముందు ఇందిరా మహిళా శక్తి సంబరాలకు హాజరైన మంత్రి వివేక్ కు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, డిఆర్డిఓ పిడి ఎస్ కిషన్, ఐకెపిడిపిఎం స్వర్ణలత, జిల్లా, మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.