సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
- జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డి
- తార్నాకలో బస్తీ బాట నిర్వహించిన డిప్యూటీ మేయర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): గ్రేటర్ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి బస్తీ బాట చేపట్టారు. టీటీయూసీ రాష్ర్ట అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి బుధవారం తార్నాక డివిజన్లోని మాణికేశ్వరి నగర్, రవీంద్ర నగర్, పార్థివాడ ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో జీహెఎంసీ, జలమండలి, విద్యుత్, రెవెన్యూ, ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. బస్తీ అభివృద్ధి కోసం జీహెఎంసీ కౌన్సిల్ మంజూరు చేసిన రూ. 2 కోట్ల నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంటీరియర్ రోడ్లు, కాలువలు, పార్కుల అభివృద్ధి, చిన్నారుల ఆట స్థలాలు, మహిళల కోసం రక్షిత ప్రదేశాల ఏర్పాటుకు ఈ నిధులను వెచ్చించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్తున్నామని శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశంతో నగర అభివృద్ధి వేగవంతమైందన్నారు. బస్తీ బాట కేవలం సమస్యలు వినడానికే కాదని, పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.




